తెలంగాణ వస్తే ఏమైతది..? మన నీళ్లు మనకొస్తయి.. మన నిధులు మనకొస్తయి.. మన ప్రజలు అభివృద్ధి చెందుతరు. మన ఉద్యోగులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవిస్తరు.. మన ఉద్యోగాలు మనకుంటయి.. తెలంగాణకోసం తండ్లాడింది ఇందుకోసమే కదా.. ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తాత్కాలిక సిబ్బంది.. అంతా ఆనందంగా ఉన్నారు. దేశంలోనే అత్యధిక వేతనాలు తీసుకొంటున్న వారిగా రికార్డు సృష్టించారు. కాలరెగిరేసి.. సగర్వంగా తిరుగుతున్నారు.
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టే.. తెలంగాణ ఉద్యోగి ఇవాళ కాలరెగిరేసి తిరుగుతున్నాడు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంతో పోల్చినా.. అత్యధిక వేతనాన్ని సగటు తెలంగాణ ఉద్యోగి పొందుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఈ తరహా వేతనాలు లేవంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. బంగారు తెలంగాణ నిర్మాణంలో శక్తివంచన లేకుండా ఉద్యోగులు చేస్తున్న కృషికి మంచి ఫలితాన్నే పొందారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 43% భారీ ఫిట్మెంట్ను అందించిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో 30శాతాన్ని అందించి ఉద్యోగులనే ఆశ్చర్యానికి గురిచేశారు. వాస్తవానికి పీఆర్సీ సిఫారసు చేసింది 7.5 శాతమే. కానీ.. సీఎం కేసీఆర్ అంతకు నాలుగురెట్లు అధికంగా ఇచ్చి ఉద్యోగుల పట్ల తన ఆదరాభిమానమేమిటో చెప్పకనే చెప్పారు. ఈ స్థాయిలో ఫిట్మెంట్ ఉంటుందని ఉద్యోగులు కనీసం ఆలోచన కూడాచేయలేదు.
పీఆర్సీపై సీఎం ప్రకటన అనంతరం పెద్ద ఎత్తున సంబురాలు చేసుకొన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగి బేసిక్ వేతనం ఇప్పటి వరకు నెలకు రూ.19,000 ఉండగా, 30% ఫిట్మెంట్ కలిపితే రూ.22,240 అవుతున్నది. ఇదే క్యాడర్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వేతనం ప్రస్తుతం నెలకు రూ.18,000 మాత్రమే. ఆఫీస్ సబార్డినేట్ వేతనం గుజరాత్లో నెలకు రూ.14,800, పక్క రాష్ట్రమైన ఏపీలో రూ.13,000 మాత్రమే. అధికారుల వేతనాలను పరిశీలిస్తే డిప్యూటీ సూపరింటెండెంట్ క్యాడర్ అధికారికి కేంద్రంలో బేసిక్, డీఏ, ఇతరత్రా కలుపుకొని కనీసం వేతనం రూ.61,149 కాగా.. తెలంగాణ అధికారి వేతనం 30% ఫిట్మెంట్తో కలిపి రూ.73,434గా ఉన్నది. ఇదే.. ఏపీ అధికారికి రూ.55,404, అస్సాంలో రూ.46,543, పంజాబ్లో రూ. 48,720, బీహార్లో రూ.57,879, కర్ణాటకలో రూ.54,624 చొప్పున వేతనాలున్నాయి. ఏ స్థాయిలో వేతనాలను పరిశీలించినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అందరికంటే గొప్పగా ఉన్నాయి.
ప్రత్యేక రాష్ట్రంలోనే అధిక పీఆర్సీ
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక తెలంగాణలోనే అధికంగా పీఆర్సీ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థికంగా మంచిగున్న రోజుల్లో కూడా 39% మించి ఏనాడూ పీఆర్సీ ఇవ్వలేదు. పెద్దపెద్ద నేతలుగా చెప్పుకొనే ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి లాంటి నేతలు ఇచ్చిన పీఆర్సీలు ఎందుకు కొరగాకుండా ఉండేవి. తెలంగాణ నేత మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగులకు మూడేండ్లకు ఒక ఇంక్రిమెంట్ చొప్పున ఇచ్చారు. జలగం వెంగళరావు 5% ఇవ్వగా వైఎస్ 16%, చంద్రబాబు 25% ఫిట్మెంట్ ఇచ్చి సరిపెట్టారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 2015లో 43%, తాజాగా 30% ఫిట్మెంట్ ఇచ్చి భారీగా వేతనాలు పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం నాలుగైదువేల రూపాయలు మాత్రమే ఉండేవి. తాజాగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే.
క్యాడర్ స్ట్రెంత్ కూడా ఎక్కువే
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి క్యాడర్ స్ట్రెంత్ ఉన్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా అదేస్థాయిలో పనిచేస్తున్నారు. అవసరాలకు తగినట్టు రిక్రూట్ చేసుకోవడానికి వీలుగా ఈ క్యాడర్ స్ట్రెంత్ ఉన్నది. కానీ 20 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో క్యాడర్ స్ట్రెంత్ కేవలం 0.31 శాతానికే పరిమితమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్లో 6.03 కోట్ల జనాభా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ 1,85,575 మాత్రమే. క్యాడర్ స్ట్రెంత్ ఉన్న మేరకు ఉద్యోగులు ఉండరనే విషయాన్ని గుర్తించాలి. అలాగే 10 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న బీహార్లో క్యాడర్ స్ట్రెంత్ 0.35% మాత్రమే ఉన్నది. కానీ 3.52 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో క్యాడర్ స్ట్రెంత్ 1.40%.. అంటే 4,91,304గా ఉన్నది.