హనుమకొండ, మార్చి 4 ;హార్ట్పుల్నెస్, శ్రీరామచంద్రమిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల యోగా మహోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజైన శనివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి ఆసనాలు వేయడంతో ఆర్ట్స్ కళాశాల మైదానమంతా కళకళలాడింది. ఉదయం ఆందోళన, ఆత్రుత గురించి యోగాసనాలు, ముద్రలు వేయించడంతో పాటు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను శిక్షకులు తెలియజేశారు. మానవాళి మనుగడ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని యోగాను నిత్యం అనుసరించడం వల్ల కఠినమైన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందని తెలంగాణ ప్రాంతీయ ఫెసిలేటర్ గుర్రం బాబు పేర్కొన్నారు. ఉదయం శిక్షణ తరగతులను, సాయంత్రం కార్యక్రమంలో ధ్యానం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా లేని, నిజ జీవితంలో కనీసం కొద్ది నిమిషాలైనా ధ్యానం, యోగా క్రమం తప్పకుండా చేయాలని పీటీసీ ప్రిన్సిపాల్ పూజ సూచించారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి నుంచి మానసిక ఉపశమనం పొందాలంటే యోగ తప్పనిసరి చేయాలన్నారు. మన పూర్వీకులు తమ ఆలోచనా విధానంతో చేపట్టే కార్యక్రమాలు ఒకసారి గమనిస్తే ఎంత ఓర్పు సమన్వయం అనుసరించే వారిని, ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో యోగాను అనుసరిస్తున్నారన్నారు. నేటి యువతీ యువకులు చిన్న సమస్యలకే తట్టుకోలేకపోతున్నారని, యోగా చేయడం వల్ల మానసిక దృఢత్వం పెంపొందుతుందని శిక్షకుడు సాంబమూర్తి వివరించారు. కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సెంటర్ కో ఆర్డినేటర్ సాంబమూర్తి, అయిలయ్య, విద్యార్థిని విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.