పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సుబేదారి, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నా రు. పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలతో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శాంతి భద్రతల పరిరక్షణకోసం చట్టాలను అమలు చేస్తూ, సమాజాన్ని సన్మార్గంలో నడుపుతున్నది పోలీసులు అని అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికి గుర్తుంటాయని మంత్రి పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదరించడం, గౌరవించుకోవడం మన విధి అని మంత్రి చెప్పారు. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రతిఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొంటున్నానని మంత్రి తెలిపారు.
అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం : సీపీ తరుణ్జోషి
పోలీసు అమరవీరుల త్యాగాలు కొనసాగిద్దామని పోలీ సు కమిషనర్ తరుణ్జోషి అన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద సీపీ తరుణ్జోషి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హనుకొండ జిల్లా న్యాయమూర్తి కృష్ణమూరి, వరంగల్ జిల్లా న్యాయమూర్తి రాధాదేవి, వరంగల్ కలెక్టర్ బీ గోపి, హనుమకొండ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు , తదితలు పాల్గొన్నారు.