వర్ధన్నపేట, డిసెంబర్ 30 : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల బ్యూటీషియన్ కోర్సు ఉచిత శిక్షణా కార్యక్రమానికి హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురుషులతో పాటు మహిళలు కూడా ఏదో ఒక పనిచేస్తేనే కుటుంబాలు గడిచే పరిస్థితి ఉందన్నారు.
పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా గృహిణులు స్వయం ఉపాధి రంగంలో రాణించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, స్త్రీ నిధి ద్వారా పెద్ద మొత్తంలో తక్కువ వడ్డీలకే రుణాలు అందిస్తున్నదని తెలిపారు. అలాగే ఏజీఎఫ్ ద్వారా కూడా మహిళలు, యువతులకు స్వయం ఉపాధిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రధానంగా మండల సమాఖ్యలు, డీఆర్డీఏ అధికారుల సహకారంతో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏజీఎఫ్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల వందల సంఖ్యలో యువకులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే రమేశ్ మండల సమాఖ్య కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో ఇటీవల వైద్యం చేయించుకున్న మండలానికి చెందిన 22 మందికి రూ.7లక్షల 8వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, మున్సిపల్ వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, ఆత్మ చైర్మన్ గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలి..
పర్వతగిరి : ప్రతి మహిళ ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో 30 రోజుల బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్న 33 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువతులు, మహిళలను స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందించాలనే బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్కుమార్, గొర్రె దేవేందర్, మండలాధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, సర్పంచ్ చింతపట్ల మాలతి, రవీందర్రావు, సీఏ కొయ్యల రాజు, కాట్రోజు రాజు, ఏపీఎం కృష్ణమూర్తి, మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమణి, సీసీలు రవీందర్రాజు, వర్కాల సుధాకర్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో రాణించాలి..
కరీమాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మామునూరులో మహిళా సమాఖ్య వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంఘాలకు అందిస్తున్న రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సమావేశాలు ఏర్పాటు చేసుకుని లెక్కలను సరి చూసుకోవాలన్నారు. స్త్రీల కోసం భవనాలు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నామన్నారు.