మహిళల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
గిరిజన, స్త్రీ శిశు, సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ప్రారంభం
భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళల జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదని లేదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి సత్యవతి హెచ్చరించారు. మహిళల రక్షణకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని,‘ షీ టీమ్స్’, ‘సఖీ’ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయన్నారు. భరోసా కేంద్రాలు బాధిత మహిళలకు సత్వర న్యాయం, వైద్యం, పరిహారం అందించేందుకు కృషి చేస్తాయని వివరించారు.
మహబూబాబాద్ రూరల్, మే 20 : మహిళల రక్షణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ రోడ్డులో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా మహిళల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు అండగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోక్సో, లైంగిక దాడి కేసుల్లో బాధితులకు ఇక్కడ సేవలతోపాటు అన్ని రకాల కేసుల్లో సత్వర న్యాయం అందించేందుకు భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందన్నారు. బాధిత మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి మనోధైర్యం నింపడం, ప్రభుత్వం నుంచి అందే పరిహారం కోసం కృషి చేయడం, న్యాయ, వైద్య సహాయం ఈ కేంద్రం ద్వారా అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్రపవార్,పోలీసులు పాల్గొన్నారు.