హనుమకొండ సిటీ, జూన్ 24 : ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పుడు సరికొత్త సరస్వతీ నిలయాలుగా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ‘సర్కారు విద్య’కు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. రూ.కోట్లాది నిధులు వెచ్చించి అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. అవసరమున్న చోట్ల కొత్త తరగతి గదులు, అదనపు గదులు నిర్మించింది. బోధనా పద్ధతుల్లోనూ అనేక మార్పులు చేసింది. ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేస్తున్నది. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకులాలను నెలకొల్పింది.
ఆదర్శ పాఠశాలలను బలోపేతం చేసింది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు, యూనిఫాంలను అందిస్తున్నది. మధ్యాహ్నం విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. పరీక్షల సమయాల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో అల్పాహారం పెడుతున్నది. ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశను తెచ్చింది. బాలికా విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఏర్పాటు చేసి ఇంటర్ వరకు బోధన అందిస్తున్నది. బాలికల సమగ్రాభివృద్ధి, ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పిస్తున్నది.
సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నది. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులో తెచ్చి తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్తో కూడిన నాణ్యమైన ద్విభాష వాచకాలను ఉచితంగా అందిస్తున్నది. ‘మన ఊరు- మనబడి’, ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. శిథిలావస్థకు భవనాలన్నీ సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, డ్యుయల్ డెస్క్లు, పహరీలు, డైనింగ్ హాల్స్, గార్డెనింగ్, డిజిటల్ బోర్డులు, ఫ్యాన్లు, విద్యుత్లైట్లు, భవనాలకు రంగులు, అవసరమైన చోట అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్స్, గ్రంథాలయాలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు, ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా ప్రభుత్వం డిజిటల్ విద్యాబోధన అందిస్తున్నది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నది. వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందిస్తున్నది. తల్లితండ్రులపై ఆర్థిక భారాన్ని తొలిగించేందుకు వర్క్బుక్స్, నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నది. గ్రంథాలయాలను ఆధునీకరించింది. ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సాకర్యాలతో పాటు ఉపాధ్యాయుల కృషితో ఏటేటా సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదుశాతం గణనీయంగా పెరుగుతున్నది.