మానుకోటలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతి పండుగ కొనసాగింది. రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించిన రామన్న, రూ.5కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ (వెజ్, నాన్వెజ్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్)ను, రూ.కోటీ పది లక్షలతో కట్టిన మోడల్ వైకుంఠధామాన్ని ప్రారంభించారు. గుమ్మడూరులో 200 డబుల్బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి వారితో గృహ ప్రవేశాలు చేయించారు. అంతకుముందు మహబూబాబాద్కు వచ్చిన మంత్రి కేటీఆర్కు బతుకమ్మలు, బోనాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.
మహబూబాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ)/బయ్యారం/కురవి : సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో మానుకోటలో ప్రగతి బాట పట్టనున్నది. ఆ నిధులతో మానుకోట రూపురేఖలు మార్చే విధంగా పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో జిల్లాకేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మలు, బోనాలు, కళాకారుల గిరిజన సంప్రదాయ ఆటపాటల నడుమ అమాత్యుడికి అడుగడుగునా పూలతో నీరాజనం పలుకుతూ ఘన స్వాగతం పలుకగా, జిల్లాకేంద్రమంతా కోలాహలంగా మారింది. ఉదయం హైదరాబాద్లోని బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన ఆయన 11.15గంటలకు జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. తొలుత తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఈ ఏడాది జనవరిలో సీఎం కేసీఆర్ మానుకోట పట్టణానికి ప్రకటించిన రూ.50కోట్ల అభివృద్ధి పనుల పైలాన్ను కేటీఆర్ ఆవిష్కరించారు. కోటీ పది లక్షల రూపాయలతో యాదవనగర్లో మోడల్ వైకుంఠధామాన్ని ప్రారంభించారు. కళాభారతి, సమీకృత క్రీడాప్రాంగణం, కంబాల చెరువు ట్యాంక్బండ్, రోడ్లు, కాల్వలు, పార్కులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చనున్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయం సమీపంలో రూ.5కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్(వెజ్, నాన్వెజ్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్)ను ప్రారంభించారు. అక్కడి నుంచి గుమ్మడూరులో 200 డబుల్బెడ్ రూం ఇళ్లను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్కు పలువురు ప్రజాప్రతినిధులు వినతులు ఇచ్చారు. మానుకోట పట్టణానికి సంబంధించిన ‘నాడు-నేడు’ బుక్ను ఎమ్మెల్యే శంకర్నాయక్ మంత్రి కేటీఆర్కు అందించారు. అలాగే కేసముద్రం మండలకేంద్రాన్ని మున్సిపాలిటీ చేయడంతో పాటు ఫైర్స్టేషన్ మంజూరు చేయాలని విన్నవించారు. అలాగే ఎంపీ కవిత పలు సమస్యలపై మంత్రి కేటీఆర్కు విన్నవించారు.
అక్కడే రామచంద్రాపురంలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటికి వెళ్లి తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారి వచ్చిన మంత్రిని కుటుంబసభ్యులు సత్కరించారు. అక్కడినుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో పోడు పట్టా పాసు పుస్తకాలను గిరిజన రైతులకు పంపిణీ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు. సభ ముగిసిన తర్వాత స్టేడియం పక్కనే ఉన్న డిగ్రీ కళాశాలలో 150మంది పోడు రైతులతో కలిసి ఇతర ప్రజాప్రతినిధులతో పాటు మంత్రి కేటీఆర్ కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. నరేశ్రెడ్డి కుటుంబసభ్యులను మంత్రి పేరుపేరునా ఆప్యాయంగా పలుకరించారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన హైదరాబాద్కు పయనమయ్యారు.