దేవరుప్పుల/పాలకుర్తి రూరల్, నవంబర్ 6 : సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల సహకారంతో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాయమాటలు నమ్మొద్దని, తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఘన విజయం చేకూర్చాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, పార్టీ మ్యానిఫెస్టోను అమలు చేశానని పేర్కొన్నారు. తాను నియోజకవర్గంలో అడుగుపెట్టిన నాడు అన్ని మండలాల్లో కరువు తాండవించేదని, సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారన్నారు. వ్యవసాయం లేక రైతులు వలస వెళ్లడంతో ఇళ్లకు తాళాలు కనిపించేవన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడడంతోపాటు ‘మిషన్కాకతీయ’లో చెరువులను పునరుద్ధరించడంతో జలకళ సంతరించుకుని బీడు భూములు సస్యశ్యామలమయ్యాయని ఎర్రబెల్లి తెలిపారు. ‘మిషన్ భగీరథ’తో ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష చొప్పున పంట రుణాలు మాఫీ చేశామన్నారు. రూ.22 వేల కోట్లు రుణం ఉండగా, ఇప్పటి వరకు రూ.19 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేశామని, మిగిలిన నిధులు త్వరలోనే జమ చేస్తామన్నారు.
తనను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మూడు సార్లు గెలిపించారని, సీఎం కేసీఆర్ తనకు కీలక మంత్రి పదవి అప్పగించారని ఎర్రబెల్లి తెలిపారు. పంచాయతీరాజ్ శాఖను సమర్ధవంతంగా నిర్వహిస్తుండడంతో తెలంగాణకు దేశంలోనే ఏ రాష్ర్టానికి దక్కనన్ని అవార్డులు వచ్చాయన్నారు. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేయిస్తానని వివరించారు. ప్రతి గ్రామంలో వంద మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 5,500 డబుల్బెడ్ రూం ఇండ్లు నియోజకవర్గానికి మంజూరు చేయగా 90 శాతం పూర్తి చేశామన్నారు. వాగులపై రూ. 100 కోట్లతో చెక్డ్యాములు నిర్మించడంతో సాగునీటి సమస్య తీరిందన్నారు. రూ. 1000 కోట్లతో బీటీ, సీసీ రోడ్లు నిర్మించామన్నారు.
పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా మ్యానిఫెస్టోను అమలు చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రైతులు పండించిన పంటలకు నష్టాన్ని కలిగిస్తున్న కోతుల సమస్యను నివారించేందుకు వాటిని అడవులకు తరలించే నిరంతర కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం అమలు చేస్తాన్నారు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇప్పించి ఉచితంగా కుట్టుమిషన్లు అందించడంతోపాటు టైక్స్టైల్ పరిశ్రమల్లో ఈ సంవత్సరం ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్లు లేని 20 వేల మందిని గుర్తించి వారికి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించామని ఎర్రబెల్లి తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పాలకుర్తి కేంద్రంగా రూ. 100 కోట్లు వెచ్చించి టూరిజం కారిడార్ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పాలకుర్తి శైవ క్షేత్రాన్ని సుందరంగా తీర్చి తొలికవి సోమనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించామన్నారు. మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతనామాత్యుడి స్వగ్రామం బొమ్మెరలో పోతన విగ్రహంతో పాటు బాసరకు ధీటుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. రామాయణాన్ని రాసిన వాల్మికి నడయాడిన వల్మిడి గుట్టపై భద్రాచలం, అయోధ్యకు దీటుగా నూతన రామాలయ నిర్మించినట్లు గుర్తు చేశారు.
ఈ నెల 10న మరోసారి నామినేషన్ దాఖలు చేస్తానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి వేలాది మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తానని, దీనికి ముఖ్యఅతిథులుగా మంత్రులు హరీశ్రావు, సత్యవతిరాథోడ్, స్టేషన్ఘన్పూర్ అభ్యర్థి, ఎమ్మెల్పీ కడియం శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఆరోగ్య శ్రీ ట్రస్టు చైర్మన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు హాజరవుతారని ఆయన వెల్లడించారు. ఈ నెల 14న తొర్రూరులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఆనంతరం దయన్న పాటల సీడీని ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు రామసహాయం కృష్ణకిషోర్రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్ పాల్గొన్నారు.
నామినేషన్ దాఖలుకు ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో, హనుమాన్ ఆలయంలో, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం, రామన్నగూడెం షీరిడీ సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. అనంతరం చర్చిలో, తొర్రూరులోని మసీదులో ప్రార్థనలు చేశారు.