కరీమాబాద్, నవంబర్ 8: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శంభునిపేటలో పట్టణ గిరిజన సంక్షేమ సేవా సంఘం బుధవారం బీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ పార్టీలో గిరిజనులకు సముచిత స్థానం కల్పించామన్నారు. వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నద న్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. గిరిజనులు బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. సీఎం కేసీఆర్తోనే గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, మంత్రి కేటీఆర్ అండదండలతో తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ పట్టణ గిరిజన సంక్షేమ సేవా సంఘం బాండ్ పేపర్ రాసి తీర్మాన ప్రతిని ఎమ్మెల్యేకు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోశాల పద్మ, పట్టణ గిరిజన సంక్షేమ సేవా సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఇతర పార్టీల నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరగా, వారికి నన్నపునేని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. తమ ప్రభుత్వంలోనే సామాన్యులకు సైతం మంచి అవకాశాలు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు.
గిర్మాజీపేట: సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచానని, వేంకటేశ్వరుడి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం ఆయన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్తో కలిసి బట్టలబజార్లోని బాలానగర్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ప్రధానార్చకుడు పరాశరం శ్రీనివాసాచార్యులు నామినేషన్ పత్రాలను స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేసి నరేందర్కు అందించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గందె కల్పన, జ్యోతిష్యుడు సుమన్శర్మ, ఆలయ ఈవో ఎలపాటి రత్నాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొలిపాక శ్రీనాథ్, బాగల్ కల్యాణ్, అర్చకులు శ్రీధరాచార్యులు, శేషాచార్యులు పాల్గొన్నారు.
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ నామినేషన్ దాఖలు చేశారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్తో కలిసి రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషాకు ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పును కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశానన్నారు. ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
వరంగల్: ఈ నెల 10వ తేదీన ప్రజలు, నాయకులతో కలిసి మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ వైపు పరుగులు తీస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో అభివృద్ధి అంటేనే వరంగల్ తూర్పు నియోజకవర్గం అన్నట్లు తీర్చిదిద్దానని అన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్ల సహకారంతో తూర్పులో మరోసారి జయకేతనం ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.