ఏటూరునాగారం, డిసెంబర్ 22 : ‘అమాయకులు ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చేతిలో హతమైతే పట్టించుకోరు.. మమ్ములను కనీసం పరామర్శించేందుకు రారు.. అదే ఎన్కౌంటర్లో నక్సల్ మృతి చెందితే మాత్రం వారి కుటుంబాలను కలిసేందుకు వస్తారు.. మావోయిస్టులకో న్యాయం.. మాకో న్యాయమా?’ అని మావోయిస్టు బాధిత కుటుంబాలు పౌరహక్కుల సంఘం నేతలను ప్రశ్నించారు. మావోయిస్టులు, పౌరహక్కుల సంఘాలకు వ్యతిరేకంగా మావోయిస్టు బాధిత కుటుంబాలు ఆదివారం సాయంత్రం ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయ సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. గత నెల 21న రాత్రి వాజేడు మండల కేంద్రంలో ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేశ్, ఎడ్ల కాపరి ఉయిక అర్జున్ కుటుంబాలతో పాటు అంతకుముందు వెంకటాపురం మండలంలో బాంబు పేలిన ఘటనలో కాళ్లు కోల్పోయిన సునీత, ఇతర బాధిత కుటుంబాల సభ్యులు ఆందోళనలో పాల్గొన్నా రు. ఈనెల 1న ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా పౌర హక్కుల సంఘాల నాయకులు పది మంది వరకు ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి ఆదివారం వస్తున్నట్లు తెలుసుకున్న రమేశ్, అర్జున్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు, గ్రామస్తులు వారిని అడ్డుకునేందుకు ఏటూరునాగారం వచ్చారు. మధ్యాహ్నం సంఘాల నాయకులు చెల్పాక వైపు వెళ్లినట్లు తెలుసుకున్నారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు చీకటి పడుతుండడంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో మృతుడు అర్జున్ భార్య సావిత్రి, తల్లి, బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.