సుబేదారి, ఏప్రిల్ 17 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య రూ.5 లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది.ఆనవాళ్లు లేకుండా బొక్కలను సంచిలో వేసి దయ్యాలవాగులో పడేంది. హత్యను వీడియో తీయించి రాక్షసానందం పొందింది. అచ్చం సినీఫక్కీలో జరిగిన ఈ మర్డర్ను పరకాల పోలీసులు ఛేదించారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన స మావేశంలో ప్రధాన నిందితురాలు భార్యతో సహా ఐదుగురు నిందితుల అరెస్ట్ను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ చూపిం చి, వివరాలు వెల్లడించారు.
డీసీపీ కథనం ప్రకారం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరకాల టౌన్కు చెందిన మడికొండ సుమన్భరత్ కనిపించడం లేదని తండ్రి సాంబ య్య ఈనెల 8న పరకాల పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఊహించని విధంగా భార్య లావణ్య భర్తను రూ.5లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తేలింది. లావణ్యకు పరకాలకు చెందిన డ్రైవర్ ఇమ్మడి నరేశ్తో వివాహేతర సంబంధం ఉన్నది. దీన్ని గమనించిన భర్త మద్యం తాగొచ్చి భార్యను వేధించాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని లావణ్య నిర్ణయించుకున్నది.
రేగొండ మండలం రావులపల్లికి చెందిన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు నరేశ్తో కలిసి హత్యకు పక్కా ప్లాన్ వేసింది. ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లు, దుంపిల్లగూడేనికి చెందిన భూక్యా రాకేశ్తో సుపారీ హత్యకు రూ.5లక్షలకు డీల్ కుదుర్చుకున్నది. వారికి లావణ్య బంగారు ఆభరణాలు కుదువబెట్టి రూ.లక్షా59వేలు, ప్రియుడు నరేశ్ రూ.2 లక్షలు, పెండల రాజు రూ.లక్ష.. ముగ్గురు కలిసి రూ.4లక్షల 59వేలు అడ్వాన్స్గా ఇచ్చారు. కాగా, ఈ నెల 3న సుమన్ భరత్ను ప్లాన్ ప్రకారం వెంకటేశ్వర్లు, భూక్యా రాకేశ్ ఇద్దరు కలిసి ములుగుకు పిలుపించుకున్నారు. మద్యం తాగారు. తర్వాత, భరత్కు డబ్బుల ఆశజూపి వెంకటేశ్వర్లు తన వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న సుమన్భరత్ తల వెనకభాగంలో వెంకటేశ్వర్లు, రాకేశ్ బీర్బాటిళ్లతో బలంగా కొట్టి చంపారు.
ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనను వెంకటేశ్వర్లు ఫోన్లో వీడియో తీసి లావణ్య పంపించాడు. మరునాడు 4వ తేదీన ములుగుకు లావణ్య, ఆమె తమ్ముడు రాజు రాగా, వారి నుంచి వెంకటేశ్వర్లు మిగతా సుపారీకి సంబంధించిన రూ.40 వేలు తీసుకున్నాడు. 5వ తేదీ రాత్రి సమయంలో వెంకటేశ్వర్లు తన వ్యవసాయ భూమి వద్దకు వచ్చి మృతుడు సుమన్భరత్ మృతదేహం బొక్కలు సంచిలో వేసి ఆనవాళ్ళు కనిపించకుండా సమీపంలోని దయ్యాలవాగులో పడేశారు. నిందితులను అరెస్ట్ చేసి స్థలంలో హత్యగురైన సుమన్భరత్కు సబంధించిన చిన్నచిన్న బొక్కలు, సిగరేట్ ముక్కలు, బీర్బాటిల్ ముక్కలు, వాగులో పడేసిన గోనె సంచిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పరకాల ఏసీపీ సతీశ్, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.