తెలంగాణ.. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం.. కానీ సంక్షేమంలో దేశానికే ఆదర్శం. కులమత తారతమ్యాలు లేకుండా అర్హులైన పేదలకు ఇక్కడ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. రైతులను సాగు పెట్టుబడి సాయం నుంచి మొదలు పంట ఉత్పత్తులను విక్రయించే వరకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతలు, కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటున్నది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు ఇస్తూ అండగా నిలుస్తున్నది. ఇప్పటికే వైద్యం, విద్యా రంగాలను పటిష్టం చేసిన ప్రభుత్వం విదేశాల్లో చదువుకొనే పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. అలాగే పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కొత్తగా ‘గృహలక్ష్మి’ పథకం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నది. కులవృత్తులకు పునరుజ్జీవం తెచ్చేందుకు ‘బీసీ బంధు’ పేరిట రూ.లక్ష సాయం అందిస్తున్నది. మైనార్టీ బంధుకూ ఏర్పాట్లు చేస్తున్నది. రైతు రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసింది.
వరంగల్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదాయం పెంచాలి… పేదలకు పంచాలనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. అవసరమైన అందరికీ ఆసరాగా నిలుస్తున్నది. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ఇప్పుడు దేశానికి దిక్చూచిగా నిలిచింది. సమాజంలోని అవసరమైన ప్రతి వర్గానికి ఆర్థికంగా అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీ, సెలూన్లు- ధోబీఘాట్లకు సబ్సిడీ కరెంటు, దళితబంధు, డబుల్బెడ్ రూం, గురుకులాల్లో ఉచిత విద్య ఇలా దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన బీసీ బంధు, మైనారిటీ బంధు పథకాల అమలు జోరందుకుంటున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. బీసీ బంధు అర్హులకు చెక్కుల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ బంధును అమలు చేస్తున్నది. గృహలక్ష్మీ పథ కం అమలు మొదలైంది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను వేగవం తం చేసింది. స్లాబుల వారీగా రుణమాఫీ జరుగుతున్నది.
సమగ్రంగా సంక్షేమం…
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. రైతు బంధు కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. వానకాలంలో హనుమకొండ జిల్లాలో 1,37,995 మంది రైతులకు రూ.132 కోట్లను, యాసంగిలో 1,35,859 మంది రైతులకు రూ.132 కోట్లను వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం కింద ఏడాదిలో సగటున రూ.12 కోట్లను ప్రభుత్వం రైతు కుటుంబాలకు ఇస్తున్నది. వరి పంటలకు కనీస మద్దతు ధర కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 155 కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేస్తున్నది. వానకాలం, యాసంగి కలిపి ఏటా రూ.300 కోట్లతో లక్షన్నర టన్నుల వడ్లను కొనుగోలు చేస్తున్నది. దీనితో సగటున 36 వేల మంది రైతులకు మేలు జరుగుతున్నది. ప్రతి ఎకరా సాగుకు యోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నది. జిల్లాలోని దాదాపు 50 వేల మోటర్లకు నిరంతరం ఉచిత కరెంటు అందిస్తున్నది. దీని కోసం ఏటా రూ.167 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నది. జిల్లాలోని రెండు మార్కెట్ కమిటీల్లోని వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం 20 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఐదు గోదాములను ప్రభుత్వం నిర్మించింది. జిల్లాలోని 1,068 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.43 కోట్లతో ఈ ఏడాది సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసింది. ఉచిత చేప పిల్లల పంపిణీ కింద 419 చెరువులలో 78 లక్షల చేప పిల్లలను, 7.63 లక్షల రొయ్య పిల్లలను వేయించింది. దీంతో 5311 టన్నుల చేపలు, 2 టన్నుల రొయ్యల ఉత్పత్తి వచ్చింది.
ఆసరా పెన్షన్లు..
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లను ఇస్తున్నది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత-చేనేత-బీడీ కార్మికులు, బోధకాలు-ఎయిడ్స్ బాధితులకు ప్రతి నెల రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.3016 చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 87,421 మందికి రూ.19.53 కోట్లను ఆసరా పెన్షన్ల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే 532 స్కూళ్లలో చదివే 42,302 మంది పిల్లలకు నాణ్యమైన సన్న బియ్యంతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. 6,235 మంది గిరిజన విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ కింద రూ.22.19 కోట్లను, బెస్ట్ అవైబుల్ స్కీం కింద మరో రూ.86 లక్షలను సాయంగా అందించింది. బీసీ వర్గానికి చెందిన 53,212 మంది విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ కింద రూ.21.85 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. 40,608 మంది విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.57.58 కోట్లను ఖర్చు చేసింది. 2,545 మంది ఈబీసీ విద్యార్థుల కోసం రూ.8.23 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద జిల్లాలోని 16 మంది ఎస్సీ విద్యార్థులకు, 17 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.6.60 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. దళిత సాధికారత కోసం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని మొదలుపెట్టింది. దళితబంధు పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 4,149 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.9.90 లక్షల చొప్పున రూ.410.70 కోట్లను ఇచ్చింది. నిరుపేదలకు సౌకర్యవంతమైన ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలకు 5,091 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 1,381 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఏడాది చివరి వరకు అన్ని ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వైద్య, ఆరోగ్యం..
ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రూ.67 లక్షలతో మిల్క్ బ్యాంకును, రూ.33 లక్షలతో బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించింది. రూ.1.20 కోట్లతో టీ-డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ ల్యాబ్ భవనాలను నిర్మాణం పూర్తయ్యింది. రూ.11 కోట్లతో 74 ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో ఆడపిల్లల పెండ్లి కోసం ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున ఇస్తున్నది. దివ్యాంగులైన ఆడపిల్లలకు రూ.1,25,145 చొప్పున ఇస్తున్నది. ప్రతి ఏటా సగటున 5,136 మందికి రూ.47.73 కోట్ల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 788 అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో 21,920 మందికి చిన్నారులకు, 2,513 మంది గర్భిణులకు, 2,232 మంది బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతున్నది. బాల రక్ష భవన్ కింద 255 మంంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఇస్తున్నది. జిల్లాలోని 6,115 మహిళా సంఘాలకు రూ.306.53 కోట్ల బ్యాంకు లింకేజీ రూపంలో ప్రభుత్వం అందించింది. ప్రతి ఏటా ఇంతే మొత్తంలో ఈ రుణాలు అందుతున్నాయి.