హనుమకొండ, అక్టోబర్ 27 : సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వర్థన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభను శుక్రవారం భట్టుపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాటు పంచుకున్నానని తెలిపారు. మూడోసారి కూడా ఆశీర్వదించాలని చేతులెత్తి నమస్కరించారు.
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు గడపగడపకూ అందుతున్నాయన్నారు. తండాలను జీపీలుగా మార్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. అలాగే వంద పడకల దవాఖాన ఏర్పాటు చేశామని, ఆకేరు వాగుపై చెక్ డ్యామ్లను నిర్మించామని పేర్కొన్నారు. కోట్ల రూపాయలతో నియోజక వర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. యువతీయువకులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. విలీన గ్రామాల్లో సాదాబైనామాల సమస్య ఉందని, పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. మరోసారి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అరూరి హామీ ఇచ్చారు.