వరంగల్ చౌరస్తా/హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 10 : ఆరోగ్య తెలంగాణే తమ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం, ఎంపీ పసునూరితో కలిసి హనుమకొండ ప్రసూతి వైద్యశాల, వరంగల్ ఎంజీఎం దవాఖానలో పలు అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఆయాచోట్ల మంత్రి హరీశ్ మాట్లాడుతూ కరోనా మూడో విడుత వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సుమారు రూ.3కోట్ల యంత్ర పరికరాలతో ఎంజీఎంలో పీడియాట్రిక్ ఐసీయూ, చిల్డ్రన్స్ వార్డును తొలిసారిగా ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాల పరిధిలో పీడియాట్రిక్ ఐసీయూ సెంటర్లను సుమారు రూ.86కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విభాగాన్ని కలుపుకొని ఎంజీఎంలో మొత్తం 1,292 పడకలకు ఆక్సిజన్ను అందుబాటులోకి తెచ్చామని, 227 వరకు ఐసీయూ పడకలను పెంచుకున్నామని వివరించారు. ఇకపై పిల్లల వైద్యం కోసం హైదరాబాద్ రానవసరం లేకుండా ఎంజీఎంలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఖాళీ ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. లక్ష్యం మేరకు వందశాతం వ్యా క్సినేషన్ పూర్తి చేసిన హనుమకొండ జిల్లా వైద్యాధికారిని, జిల్లా యంత్రాంగాన్ని అభినందించా రు. 91శాతం వ్యాక్సినేషన్, 63శా తం యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన వరంగల్ జిల్లా అధికారులు త్వరలో లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు.
సుమారు రూ.రెండు వేల కోట్లతో ఉత్తర తెలంగాణలో మరిన్ని అధునాతన వైద్యసేవలను అందించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి హరీశ్ వివరించారు. వచ్చే రెండేళ్లలో ప్రతి తెలంగాణ పౌరుడిపై ప్రభుత్వం రూ.1,698 ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన నీతి ఆయోగ్ సర్వే ప్రకారం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. మొదటి స్థానాన్ని దక్కించుకునేందుకు వైద్యుల సహకారంతో ముందుకుపోతామన్నారు. సుమారు రూ.4వేల కోట్లతో 8 మెడికల్ కాలేజీల నిర్మిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతే సుమారు నాలుగు రెట్ల ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ సాధించుకున్నామని చెప్పారు. 2014 విద్యాసంవత్సరంలో 700కు మాత్రమే పరిమితమైన ఎంబీబీఎస్ సీట్లు, 2022 నాటికి 2,850గా ఉన్నాయన్నారు. పీజీ సీట్ల సంఖ్య 531 ఉంటే, ఇప్పుడు 938కి చేరిందన్నారు. ఏడేళ్లలోనే వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. మరో రూ.4వేల కోట్లతో హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో 1100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడుతామని, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ సూపర్స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.
వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనం పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, ఇప్పటికే డిజైన్ పూర్తయ్యిందని, ఫిబ్రవరి చివరి వారంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతామని మంత్రి చెప్పారు. ఈ హాస్పిటల్ను 2వేల పడకల సామర్థ్యంతో నిర్మిస్తామన్నారు. దీనికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 900 పడకలతో హాస్పటళ్ల నిర్మాణానికి అనుమతులు సైతం ఇచ్చామన్నారు. నర్సంపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలో 200 పడకల హాస్పటళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో 100 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, దానికితోడు మరో 200 పడకల వైద్యశాలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు.
ఎంజీఎంకు సుమారు రూ.7.50కోట్లతో అధునాతన ఎంఆర్ఐ మిషన్ను, సుమారు రూ.2.15కోట్లతో అదనపు సీటీ స్కాన్ యంత్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో రెండు యంత్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థినుల హాస్టల్ మరమ్మతులకు రూ.90లక్షలు, జూనియర్ డాక్టర్స్ హాస్టల్ మరమ్మతులకు రూ.40లక్షలు, ప్రాంతీయ నేత్ర వైద్యశాల మరమ్మతులకు రూ.50లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు.
మంత్రుల వెంట ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్రావు, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, బానోత్ శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి, వరంగల్ కలెక్టర్ గోపి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు తదితరులున్నారు. జీఎంహెచ్లో జరిగిన కార్యక్రమాల్లో డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవి, జడ్పీ అధ్యక్షుడు సుధీర్బాబు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుడిమల్ల రవికుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ సరళాదేవి, ఆర్ఎంవో సారంగం, పీడీయాట్రిక్ వైద్యులు భార్గవి, సిబ్బంది పాల్గొన్నారు.
విద్య, వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని, రూ.7300 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు పాఠశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్స్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కో సెంటర్కు సుమారు రూ.3.50కోట్లతో అత్యాధునిక యంత్ర పరికరాలను అందిస్తున్నామని, ప్రస్తుతం 20 జిల్లాల్లో సేవలు అందిస్తున్నామని, మరో రెండు నెలల్లో మిగతా 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
శిశువుకు మొదటి గంటలో ఇచ్చే తల్లిపాలు అమృతంతో సమానమని మంత్రి అన్నారు. ప్రస్తు తం శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల పుట్టిన శిశువులకు తల్లిపాలు మొదటి గంట లో అందక అనారోగ్యం పాలవుతున్నారన్నారు. అధికారులు చేపట్టిన సర్వేలో కేవలం 36 శాతం మంది పిల్లలే గోల్డెన్ అవర్లో తల్లిపాలు తాగుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకే సుమారు రూ.కోటితో జీఎంహెచ్లో మదర్ మిల్క్ బ్యాంక్ను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నీలోఫర్లో ఉన్న ఈ కేంద్రానికి మంచి సందన వస్తున్నదని గుర్తించిన అధికారులు హనుమకొండలో ఏర్పాటు చేయాలని కోరడంతో ప్ర భుత్వం రెండో సెంటర్ను ఇక్కడ మంజూరు చే సిందని చెప్పారు. నిపుణుల పర్యవేక్షణలో బాలింతల నుంచి పాలు సేకరించి, వాటిని శుద్ధి చేసి గో ల్డెన్ అవర్లో పిల్లలకు పట్టిస్తారని వివరించారు.
నయీంనగర్: హనుమకొండ కేయూ రోడ్డులో ఉన్న టీబీ హాస్పిటల్లో స్పెషాలిటీ క్లినిక్ను మంత్రి హరీశ్ గురువారం ప్రారంభించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. హనుమకొండ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయిన సందర్భంగా దవాఖాన ఆవరణలో మంత్రులు, చీఫ్విప్, ఎమ్మెల్సీ, మేయర్, ఎమ్మెల్యేలు కేక్ కట్చేసి సంబురాలు జరుపుకొన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు మంత్రి, చీఫ్విప్ కేక్ తినిపించారు. ఇక్కడ డీఎంహెచ్వో లలితాదేవి, వైద్యులు, టీఆర్ఎస్ నాయకులున్నారు.
ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని మంత్రి హరీశ్ సూచించారు. ఇతర జిల్లాల దవాఖానలతో పోల్చితే జీఎంహెచ్లో ఎక్కువ ఆపరేషన్లు చేస్తున్నారని, సాధారణ ప్రసవాలు చేయాలని సూపరింటెండెంట్ సరళాదేవిని ఆదేశించారు.
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల మొదటి అంతస్తులో మదర్స్ మిల్క్ బ్యాంకు కేంద్రాన్ని, దవాఖాన ఆవరణలో రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ మొదటిసారిగా రక్తదానం చేసిన అనంత్కుమార్కు మంత్రి హరీశ్రావు, చీఫ్విప్ వినయ్భాస్కర్ సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. అనంతరం జీఎంహెచ్ ఆవరణలో టీ డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ, ల్యాబ్ భవన సముదాయ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.కోటిన్నరతో పనులు ప్రారంభించారు. వరంగల్ ఎంజీఎంలో రూ.42 లక్షలతో ఏర్పాటు చేసిన 12 పడకల పీడియాట్రిక్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), 30 పడకల స్పెషల్ చిల్డ్రన్ వార్డును మంత్రులు ప్రారంభించారు.
మంత్రి హరీశ్కు వినతులు వెల్లువెత్తాయి. తమకు వేతనాలను నేరుగా ఇచ్చేలా చూడాలని కేసీఆర్ కిట్ పథకం డాటా ఎంట్రీ ఆపరేటర్లు విన్నవించారు. 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్ల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని ఇన్చార్జి డాక్టర్ ఆచార్య ఆధ్వర్యంలో సిబ్బంది మంత్రికి విన్నవించారు. డీఎస్సీ-2008లో కామన్ మెరిట్ నోటిఫికేషన్ ప్రకారం ఎంపికై నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని టీఎస్ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు త్వరలోనే వస్తానని మంత్రి హరీశ్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో వైద్యశాల పనితీరును సమీక్షించి, వాటి అవసరాలను గుర్తించి, మౌలిక వసతుల కల్పనకు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తానన్నారు. జిల్లాల వారీగా వైద్యశాలల పనితీరును పరిశీలిస్తానని చెప్పారు.మంత్రి సత్యవతి రాథోడ్ వినతి మేరకు మేడారం జాతరపై రాష్ట్రస్థాయి అధికారులతో పర్యవేక్షణ చర్యలు చేపడుతామన్నారు.