ఖిలావరంగల్, సెప్టెంబర్ 25 : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా, వివిధ శాఖల అధికారులతో కలిసి దూపకుంటలోని డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే సందర్శించారు.
నిర్మాణం పూర్తయిన ఇండ్లలో కలియదిరిగి వాటిని తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్రూం పరిసరాల్లో మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, గ్రీనరీ వంటి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇండ్లు నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలోనే పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్అండ్బీ అధికారి జితేందర్రెడ్డి, బల్దియా ఎస్ఈ కృష్ణారెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కృషితో ‘సీకేఎం’ ప్రభుత్వపరం
పోచమ్మమైదాన్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు ఎందరో మహానీయులు సేవలందించిన, ఎయిడెడ్ సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సీఎం కేసీఆర్ కృషితో ప్రభుత్వపరమైందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఇటీవల దేశాయిపేటలోని సీకేఎం కళాశాలను ప్రభుత్వం ఆధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆచార్య చందా కాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా నామకరణం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రిన్సిపాల్, యాజమాన్యానికి ఎమ్మెల్యే నరేందర్ సోమవారం అందజేశారు.
ముందుగా కళాశాలలోని చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 44తో చరిత్రాత్మక నిర్ణయం ద్వారా సీకేఎం కళాశాలను ప్రభుత్వపరం చేసినట్లు తెలిపారు. దీంతో కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుని ఈ అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే నరేందర్కు కళాశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.