నల్లబెల్లి, ఫిబ్రవరి 8 : ‘మన ఊరు-మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎంపీపీఎస్లో జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆశయానికనుగుణంగా పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, ఇన్చార్జి ఆర్డీవో మహేందర్జీ, తహసీల్దార్ దూలం మంజుల, మన ఊరు-మన బడి ప్రోగ్రాం ఏఈ చందర్, సర్పంచ్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.
భూముల సమస్యపై ఆరా..
మండలంలోని కన్నారావుపేట, బుచ్చిరెడ్డిపల్లె, పద్మాపురం గ్రామాలకు సంబందించిన సర్వే నంబర్ 58లో సుమారు 1600 ఎకరాల భూమి ఉంది. కాస్తులో ఉన్న కొంతమంది రైతులు పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని ఇటీవల కలెక్టర్ను కలిశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ గోపి కన్నారావుపేట గ్రామాన్ని సందర్శించారు. భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని తనిఖీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ దేవరాజ్, ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్లు తంగెళ్ల నిర్మల, నూనావత్ వెంకన్ననాయక్ తదితరులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలి..
గిర్మాజీపేట : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ బీ గోపీ అన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గర్భస్రావాలు జరుగకుండా పీసీపీఎన్డీ యాక్ట్ను పకడ్బందీగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు డీపీటీ చికిత్సను తగిన సమయంలో అందించాలన్నారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధులైన క్యాన్సర్, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలని, 30 సంవత్సరాలు నిండిన వారికి స్క్రీనింగ్ చేసి వ్యాధులను గుర్తించి చికిత్స చేయాలన్నారు. ఈ-సంజీవని ద్వారా జిల్లాలోని 118 సబ్సెంటర్లలో ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రతి ప్రోగ్రాం ఇండికేటర్లను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో గోపాల్రావు, ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు పద్మశ్రీ, మధుసూదన్, ఫిజియోథెరపిస్ట్ నర్సింహారెడ్డి, డిప్యూటీ డెమో అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.