దేవరుప్పుల, ఏప్రిల్ 25 : ‘మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రల్లో ఎక్కడా లేవు.. అందుకే దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారు.. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించినప్పటి నుంచి సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు.. ఇందుకు నిదర్శనంగా మహారాష్ట్రలో ప్రజల స్పందనే అద్దంపడుతుంది..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ మంగళవారం దేవరుప్పులలో ఘనంగా జరిగింది. కళాకారుల ఆటపాటల మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లికి నివాళులర్పించారు. అనంతరం ప్రతినిధుల సభలో ఎర్రబెల్లి మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగలా సీఎం కేసీఆర్ మార్చారన్నారు. దేశంలో ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని, బీజేపీ అధికారం ఇస్తే మతోన్మాదంతో వ్యవహరిస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ముచ్చటగా మూడోసారి కేసీఆర్ పాలన
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ పాలన వస్తుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు ఆమడదూరంలో ఉన్నాయని, ఆ పార్టీ నేతల మాటలను ప్రజలు విశ్వసించడలేదని స్పష్టం చేశారు. మరోసారి కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్షాలతో రచ్చబండపై చర్చపెట్టి వారి మాటలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలు అమలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించాలన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, సాగునీటి విషయంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందని ఎర్రబెల్లి తెలిపారు. దేశంలో అపారమైన నదీజలాలున్నా సాగు, తాగునీటికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పాలకులే కారణమన్నారు.
రైతులను మభ్యపెడుతున్న బండి సంజయ్
వడగండ్ల వానకు పంట నష్టం జరిగితే సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతులకు ఎకరానికి రూ.10 వేలు సాయం ప్రకటిస్తే కేంద్రం రూపాయి కూడా ఇవ్వడంలేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ మాత్రం ప్రగల్భాలు పలుకుతూ ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పంట నష్టం జరిగినా ఎకరాకు రూ.3 వేలకు మించి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మనలాగా ఇస్తున్నారా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. బండి సంజయ్కి రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి ఎకరాకు మరో రూ.10వేల చొప్పున ఇప్పించాలని ఆయన సవాల్ విసిరారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగులు ఇస్తామన్నా ప్రధాని మోదీ ఆచరణలో అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు.
అంచనాకు మించి హాజరైన ప్రతినిధులు
బీఆర్ఎస్ ఆవిర్బావ ప్లీనరీకి ఐదు వేల మంది వస్తారని మంత్రి ప్రకటించగా అంచనాకు మించి ఏడు వేల మంది వచ్చారు. ప్లీనరీ విజయవంతానికి కృషి చేసిన దేవరుప్పుల మండల నాయకులకు మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య శర్మ, కాకిరాల హరిప్రసాద్, ముస్కు రాంబాబు, ఈదునూరి రమాదేవి, జాటోతు నెహ్రూనాయక్ ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్, పసునూరి నవీన్, సిందె రామోజీ, సీతారాములు, ఈదూరి అయిలయ్య, నర్సింహనాయక్, ఎంపీపీలు బస్వ సావిత్రి, అనివిరెడ్డి, నల్ల నాగిరెడ్డి, జ్యోతి, రాజేశ్వరి, జడ్పీటీసీలు పల్లా భార్గవీరెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్రావు, అందె యాకయ్య, రంగుకుమార్, జినుగు సురేందర్రెడ్డి, మదార్, శ్రీరాం జ్యోతిర్మయి,శ్యాంసుందర్రెడ్డి, మధుసూదన్, రవీందర్, కల్పన, చింత రవి. సుధాకర్, దల్జీత్ కౌర్, బస్వ మల్లేశం, పల్లా సుందరాంరెడ్డి, లింగాల రమేశ్రెడ్డి, చామల విక్రంరెడ్డి, వెంకట నారాయణగౌడ్, అందె యాకయ్య, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.