కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో కాల్వల్లో నీళ్లు లేక చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. బోరు బావులన్నీ బోరుమంటున్నాయి. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. చేతి కందే దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు భగీరథ యత్నం చేస్తున్నారు. పదేండ్ల తర్వాత కొత్త బావులను తవ్విస్తున్నారు. అడుగంటిన బావుల్లో పూడిక తీయిస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఖర్చయినా అప్పు తెచ్చి మరీ పనులు చేయిస్తూ పంటలను రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంత చేసినా పంటలు చేతికందేనా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరుతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సాగునీటి ధీమాతో పంటలు సాగు చేసిన రైతులకు ఇప్పుడు పంట చేతికి వస్తుందా అనే ఆందోళన పెరుగుతున్నది. సాగునీటి నిర్వహణలో సర్కారు నిర్లక్ష్యం ఈ ఏడాది రైతులకు భారీగా నష్టం కలిగిస్తున్నది. ఎనిమిదేండ్లుగా వచ్చినట్లుగా సాగునీరు రాకపోవడంతో పంటలను బతికించుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు. యాసంగిలో సాగు చేసిన వరి పంటకు మరో నెల వరకు సాగునీరు అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాల్వల నుంచి చెరువులు, పంటలకు నీరు రావడం లేదు. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బావులను తవ్వుతున్నారు. ఎక్కువ మంది రైతులు ఉన్న బావుల్లో పూడిక తీయిస్తున్నారు. బావుల తవ్వకం, పూడికతీతతో రైతులపై ఆర్థికంగా భారం పడుతున్నది. కొత్త బావి తవ్వేందుకు కనీసం రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల ఖర్చవుతున్నది. పూడికతీత కోసం గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. సాగునీటి సమస్యతో సొంతంగా నీటి వనరులను కల్పించుకునేందుకు రైతులు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో వారికి అప్పులు పెరుగుతున్నాయి. సర్కారు సాగు నీరు ఇవ్వకపోవడంతో ఈసారి యాసంగి పంట చేతికి వచ్చే దాకా నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి వనరుల కోసం అప్పులు చేయాల్సి రావడంతో రైతుల్లో ఆందోళన ఎక్కువ అవుతున్నది.
సాగునీటి వసతి లేక ఇబ్బంది పడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం సైతం అందడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సాయం రైతులకు అందడం లేదు. రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని సైతం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు సైతం పూర్తిగా పెట్టుబడి సాయం అందలేదు. సర్కారు నిర్లక్ష్యంతో సాగునీటి వసతి కోసం రైతులు భారీగా ఖర్చు పెడుతున్న సమయంలోనూ వారికి పెట్టుబడి సాయం అందడం లేదు. సాగునీరు ఇవ్వక, పెట్టుబడి సాయం అందించక రాష్ట్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో సాగునీటి వసతులు పెరిగాయి. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీరాంసాగర్, దేవాదుల ఆయకట్టు స్థిరీకరణ కోసం అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయించారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు ఏడేండ్లు నిండుగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి వెంట దాదాపు 150 కిలోమీటర్ల వరకు నీటి నిల్వతో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రతి ఊరిలోనూ సరిపడా భూగర్భ జలాలు ఉండడం, ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల నుంచి చెరువులకు, అక్కడి నుంచి పంటలకు నీళ్లు వచ్చేవి. వానకాలం పంటలకు నీటి వసతిలో ఎక్కడా ఇ బ్బంది లేకుండా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దేవాదుల ప్రాజెక్టు నుంచి పంపింగ్ జరుగుతున్నా నీటి సరఫరా నిర్వహణలో విఫలమైంది. ఎస్సారెస్పీ ఆయకట్టు విషయంలోనూ ఇదే జరిగింది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో ఐదేండ్లుగా రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు వచ్చే గ్రామాలకు ఇప్పుడు రావడం లేదు. సాగునీటి సరఫరా నిర్వహణలో ప్రభుత్వ లోపం కారణంగా అంతటా భూగర్భ జలాలు వేగంగా తగ్గాయి. నెల రోజుల్లోనే సగటున మీటరు లోపలికి వెళ్లాయి. దీంతో ఇప్పటికే ఉన్న బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే సాగు నీరు సరఫరా చేస్తుందని రైతులు ఈ యాసంగిలోనూ పంటలు వేశారు. నీళ్లు లేక పంటలు ఎండి పోయే పరిస్థితి వచ్చింది. సాగునీటి సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు క్రమంగా నమ్మకం కోల్పోతున్నారు. ఒక్కొక్కరుగా సొంతంగా నీటి వనరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇన్నేండ్లు పంటలతో వచ్చిన పైసలను ఇప్పుడు కొత్త బావుల కోసం, పాత బావుల పూడికతీత కోసం ఖర్చు చేస్తున్నారు.
మాకు మూడు ఎకరాల పంట భూమి ఉన్నది. ఇన్నేండ్లు నీళ్లు మంచిగ ఉండె. పత్తి పంట వేసేది. దేవాదుల నీళ్లు అప్పటి లెక్క వస్తలేవు. రూ.7లక్షలు అప్పు చేసి బాయి తీయించిన. పంట పండి అప్పులు తీరుతయో లేదో చూడాలె.
పదేండ్ల కింది వరకు కరీంనగర్, వరంగల్ జిల్లాలకు బావులు తవ్వేందుకు వచ్చేవాళ్లం. వందల బావులు తవ్వినం. తెలంగాణ వచ్చినంక ప్రాజెక్టులతోని నీళ్లు వచ్చి మాకు పని లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ల మాకు పాత రోజులు వచ్చాయి. రైతుల బావుల్లో పూడికలు తీసుడు, కొత్త బావులు తవ్వుడు చేస్తున్నం.