కాశీబుగ్గ, ఏప్రిల్ 15 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. వరుసగా పది రోజుల పాటు ఉగాది, రంజాన్ పండుగల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్కు లక్షా 50వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీంతో మార్కెట్లో ఎటుచూసినా మిర్చి బస్తాలతో నిండిపోయింది. ఆయా రాష్ర్టాల్లో ధరలు తక్కువగా ఉండడంతో పక్కనున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాష్ర్టాల నుంచి కూడా రైతులు మిర్చి బస్తాలను అమ్ముకునేందుకు తీసుకొస్తున్నారు. మిర్చి రాక పెరగడంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతో పాటు దడువాయి, గుమస్తా, హమాలీ, ఇతర కార్మికవర్గాలు చేతి నిండా పని దొరుకుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ధరలు లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మార్కెట్కు డిసెంబర్ నుంచి కొత్త మిర్చి రావడం ప్రారంభమైంది.
సీజన్ ప్రారంభంలో 2వేల నుంచి 10వేల బస్తాల రాగా సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో రావడం మొదలైంది. ఫిబ్రవరి 19న, మార్చి 14న లక్షకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. అప్పటినుంచి రోజూ అత్యధికంగా 50వేల నుంచి 80వేల బస్తాలకు పైగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మార్కెట్కు 9లక్షల క్వింటాళ్లకు పైగా మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అందులో ధరలు తేజా రకం గరిష్ఠంగా రూ.18వేల 300, కనిష్ఠంగా రూ.14వేల 500, వండర్హాట్ గరిష్ఠంగా రూ.15వేలు, కనిష్ఠంగా రూ.11వేలు, యూఎస్ 341 రకం గరిష్ఠంగా 500, కనిష్ఠంగా 11వేలు, దేశీ రకం గరిష్ఠంగా రూ.27వేలు, కనిష్ఠంగా రూ.20వేలు, సింగిల్ పట్టి గరిష్ఠంగా రూ.30వేలు, కనిష్ఠంగా రూ.23వేలు, తాలు రకం మిర్చి రూ.7వేలు, కనిష్ఠంగా రూ.3వేలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అటు గిట్టుబాటు ధర లభించక ఇటు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు ఖాళీ లేక రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో కొందరు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.