వరంగల్ చౌరస్తా : వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఎల్వీఆర్ నగర్ని మోడల్ కాలనీగా తీర్చి దిద్దుతానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన చిన్నతనంలో ఎల్వీఆర్నగర్ వాసులు పడిన ఇబ్బందులను ఆయన గుర్తు చేస్తూ నాటి ఇబ్బందులు నేటితరం పడకూడదన్న ఆశయంతో ఎల్వీఆర్ నగర్కు అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. తాను సైతం పేదరికంలో పుట్టి పెరిగానని, అద్దె ఇంటి కష్టాలను సైతం అనుభవించానని గుర్తు చేశారు. తాను మేయర్గావున్న సమయంలోనే ఎల్వీఆర్ నగర్ వాసులు తనను కలిసి వారి కష్టాలను తెలియజేశారని, వెంటనే అధికారులతో మాట్లాడి మోడల్ కాలనీగా మార్చడానికి చేపట్టాల్సిన చర్యలను చేపట్టాలని ఆదేశించానన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని నాటికి నేటికి ప్రజల కష్టాలను తీర్చడానికి కేసీఆర్, కేటీఆర్ల అడుగుజాడల్లో ముందుకు నడుస్తామన్నారు.
మేయర్గా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ఆయన అన్నారు. త్వరలోనే అన్ని ఇళ్లకు కరెంటు మీటర్లు, రోడ్డు సౌకర్యాలు, మురుగునీటి కాల్వ నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ రమేశ్, దుబ్బ శ్రీనివాస్, చిలుక రాజు, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.