సంగెం, జూన్ 25 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని గిరిజన సంక్షేమ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంగెం మండలంలోని చింతలపల్లి, పల్లార్గూడ, మొండ్రాయి, ముమ్మిడివరం గ్రామాల్లో రూ.12కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవంతోపాటు ముమ్మిడివరం-చింతలపల్లి బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. అలాగే, చింతలపల్లి- వీఆర్ఎన్తండా, వీఆర్ఎన్తండా నుంచి ముమ్మిడివరం వరకు రూ6.50కోట్లతో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. మొండ్రాయి, పల్లార్గూడ, ముమ్మిడివరం గ్రామాల్లో రూ 7.20కోట్లతో నిర్మించిన ప్రధాన సీసీ రోడ్లతోపాటు అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ధర్మారెడ్డికి స్థానికులు డీజేలు, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు.
పల్లార్గూడ జీపీ నుంచి వీఆర్ఎన్ తండా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముమ్మిడివరం గ్రామంలో సర్పంచ్ ఇజ్జగిరి స్వప్న-అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగమన్నారు. రాష్టంలో గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రూ.2వేల కోట్లతో గిరిజన తండాల్లో రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నది సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. రూ.2వేల పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఆయన మరోసారి సీఎం కావాలని దేవుడికి మొక్కుకుని, చెప్పులు కూడా వేసుకోవడం లేదన్నారు. అలాంటి మంచి నాయకుడిని మూడోసారి ముఖ్యమంత్రిగా నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. 4లక్షల ఎకరాల పోడు భూములను త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పరకాల నియోజకవర్గానికి రూ.2కోట్లతో బంజారా భవన్ ఇస్తామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న చల్లా ధర్మారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను నిలదీయాలని పిలపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేసిన పనులను ప్రజలకు చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.60కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు. మచ్చాపూర్-చెన్నారావుపేట వరకు డబుల్ రోడ్డు రూ.26 కోట్లతో మంజూరైందన్నారు. ఎల్గూర్చెరువు మత్తడిపై ైప్లెఓవర్ కోసం రూ.10 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ముమ్మిడివరం- చింతలపల్లి రోడ్డు రూ6.50కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొండ్రాయి గ్రామంలో సైడ్ కాల్వలతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం ప్రజలు సహకరించాలన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు. అనంతరం మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని గజమాలలతో స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు ఇజ్జగిరి స్వప్న, గూడ కుమారస్వామి, ఇండ్ల రవికుమార్, కక్కెర్ల కుమారస్వామి, బిచ్చానాయక్, రమాదేవి, ఎంపీటీసీలు గుగులోతు వీరమ్మ-గోపిసింగ్, కొనకటి రాణి-మొగిలి, కట్ల సుమలత-నరేశ్, బొమ్మ పావని-యుగేంధర్, నాయకులు నరహరి, ఇజ్జగిరి అశోక్, కొనకటి మొగిలి, గండ్రకోటి రవి, లక్క మొగిలి, నాల్లం వీరస్వామి, అనుముల ప్రతాప్, మాదినేని కోటి, రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆర్అండ్బీ, పీఆర్ శాఖల అధికారులు పాల్గొన్నారు.