సూపర్స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్
కొనసాగుతున్న నిర్ధారణ పరీక్షలు
వైరస్పై అప్రమత్తంగా ఉండాలి
నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్
నర్సంపేట, జూన్ 14: జిల్లాలో కరోనా టీకా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా సోమవారం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న వారికి వ్యాక్సిన్ వేశారు. నర్సంపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 98 సూపర్స్ప్రెడర్లకు కోవిషీల్డ్ టీకాలు వేశారు. 19 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పీ గోపాల్ మాట్లాడుతూ కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్సిజన్ శాతం తగ్గితే నిర్లక్ష్యం చేయకుండా దవాఖానలో చేరి వైద్యం పొందాలన్నారు.
28 మందికి టీకాలు..
చెన్నారావుపేట: స్పెషల్డ్రైవ్లో భాగంగా పీహెచ్సీలో వివిధ ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంఘాలకు చెందిన సిబ్బందికి, డయాలిసిస్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు బుధవారం వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వైద్యాధికారిణి ఉషారాణి తెలిపారు. సంబంధిత శాఖల వారు ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు వెంట తెచ్చుకొని టీకాలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లకు మాస్కులు, ఫేస్షీల్డ్లు, శానీటైజర్లు పంపిణీ చేశారు. మండలకేంద్రంలోని పీహెచ్సీ ఆవరణ, సబ్ సెంటర్లలో 111 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, నలుగురికి పాజిటివ్ వచ్చిందని, స్పెషల్డ్రైవ్లో సోమవారం 28 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఉషారాణి అన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్నర్సు స్వరూపారాణి, హెల్త్అసిస్టెంట్ కుండె శివాజీ పాల్గొన్నారు.
ఖానాపురంలో 63 మందికి..
ఖానాపురం/ఆత్మకూరు/శాయంపేట: ఖానాపురంలోని పీహెచ్సీలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా వ్యాక్సిన్, కరోనా పరీక్షలు చేస్తున్నారు. సోమవారం 63 మందికి వ్యాక్సిన్ వేయడంతో పాటు 35 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు మండల వైద్యాధికారి విపిన్కుమార్ తెలిపారు. ఇందులో ఏడుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి అరుణ్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆత్మకూరులోని పీహెచ్సీలో 79 మందికి కరోనా పరీక్షలు చేయగా, నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రణధీర్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి మందులు అందించి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించినట్లు తెలిపారు. శాయంపేట మండల పరిధిలో 25 మందికి కరోనా పరీక్షలు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నాగశశికాంత్ తెలిపారు. శాయంపేటలో ముగ్గురు, మైలారంలో ఇద్దరు, కాట్రపల్లి, కొప్పుల, మాందారిపేటలో ఒకరి చొప్పున కరోనా బారిన పడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో వెంకటేశ్వరవర్మ తదితరులు పాల్గొన్నారు.