అక్కడే పరిశోధన ల్యాబ్లు కూడా..
సెంట్రల్ జైలు స్థానంలో ఏర్పాటుకు నిర్ణయం
వైద్య శాఖకు స్థలం అప్పగింత
నగర శివారులోకి తరలిపోనున్న కారాగారం
ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్
వరంగల్, మే 9 : ఉత్తర తెలంగాణ జిల్లాలకు వైద్య పరంగా పెద్దదిక్కుగా ఉన్న వరంగల్ హెల్త్ హబ్గా మారబోతోంది. వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో రీజినల్ కార్డియాక్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలను ఆనుకొని ఉన్న సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్య శాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో ఆధునిక పరిశోధనాశాలలు, రీజినల్ కార్డియాక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అటుపక్కనే వెయ్యి పడకల ఎంజీఎం దవాఖాన ఉండడంతో ఇలా అన్ని రోగాలకు ఒకే చోట వైద్యం అందేలా తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ప్రతి పేదోడికి మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో సర్కారు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో అన్ని రకాల వైద్యం ఒకేచోట అందేలా కేఎంసీ నుంచి ఎంజీఎం దవాఖాన వరకు హెల్త్ హబ్గా తీర్చిదిద్దనుంది. వైద్య విశ్వవిద్యాలయంతో పాటు ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ దవాఖాన త్వరలోనే అందుబాటులోకి రానుంది. కాకతీయ మెడికల్ కాలేజీతో పాటు ఎంజీఎం దవాఖాన అందుబాటులో ఉన్న వరంగల్లో మరిన్ని ఆధునిక వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. కేఎంసీ పక్కనే ఉన్న సెంట్రల్ జైలును నగర శివారు ప్రాంతంలోకి తరలించనున్నారు. ఆ జైలు స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించనున్నారు.
ల్యాబ్లు, రీజినల్ కార్డియాక్ సెంటర్
వైద్య శాఖకు అప్పగించనున్న సెంట్రల్ జైలు స్థలంలో వైద్య రంగానికి సంబంధించిన పరిశోధన శాలలు ఏర్పాటుతో పాటు రీజినల్ కార్డియాక్ సెంటర్ను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం వరంగల్ను హెల్త్ హబ్గా అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగానే సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్యశాఖకు అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ జైలుకు చెందిన 73 ఎకరాల స్థలంలో రీజినల్ కార్డియాక్ సెంటర్తో పాటు వైద్యపరంగా అనేక ల్యాబ్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానకు తోడు త్వరలోనే సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. సెంట్రల్ జైలు స్థలంలో రీజినల్ కార్డియాక్ సెంటర్ ఏర్పాటు చేస్తే వరంగల్ పూర్తి స్థాయిలో హెల్త్ హబ్గా మారనుంది.