ఖిలావరంగల్, జనవరి 13: వరంగల్ రైల్వేస్టేషన్ శుక్రవారం ప్రయాణికుల తాకిడితో రద్దీగా మారింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు ఉద్యోగులు, వ్యాపారులు, పుట్టింటికి వెళ్లే ఆడబిడ్డలు కుటుంబ సమేతంగా ఆయా గ్రామాలకు వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. మరోవైపు నేటి నుంచి ధనుర్మాసం ముగుస్తుండడంతో నదీ, సముద్ర స్నానాలు, క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తులు కూడా స్టేషన్కు చేరుకున్నారు. దీంతో వరంగల్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా అవి ఏ మాత్రం సరిపోలేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. రద్దీ మూలంగా ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రయాణించారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు కిక్కిరిసిన రైళ్లు ఎక్కలేక అవస్థలు పడ్డారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భద్రతపరమైన చర్యలు లేకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. అలాగే బస్సుల ద్వారా వెళ్లే ప్రయాణికులు వరంగల్ బస్టాండ్కు చేరుకున్నారు. దీంతో బస్టాండ్ కూడా ప్రయాణికులతో రద్దీగా మారింది.