సుబేదారి, డిసెంబర్ 9 : వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ శుక్రవారం రాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసు అధికారుల పనితీరును పర్యవేక్షించారు. వాహనదారులతో మాట్లాడి విధిగా ట్రాఫిక్ నింబధనలు పాటించాలని సూచించారు. వరంగల్ నగరంలో చోరీకి గురైన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, రిజిస్ట్రేషన్ చేయకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలను గుర్తించి సీజ్ చేయడం గురు, శుక్రవారాల్లో లా ఆర్డర్, ట్రాఫిక్ విభాగం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీపీ వరంగల్ రైల్వేస్టేషన్, చింతల్ బ్రిడ్జి తెలంగాణ జంక్షన్, మామునూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరు, నగరంలో ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకోవడం కోసం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వరంగల్ నగరంలో చోరీకి గురైన వాహనాలను గుర్తించడానికి తనిఖీలు చేపడుతున్నామని, ఇకనుంచి ప్రధాన రోడ్డు మార్గాల్లోనే కాకుండా ఇతర మార్గాల్లో కూడా వాహన తనిఖీలు చేపట్టాలని, ప్రజలకు మరింత నమ్మకం కలిగించాలని, నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.