సుబేదారి, మార్చి 25 : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పాత నేరస్తులతో పాటు రౌడీషీటర్ల ప్రస్తుత కదలికలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పోలీస్ అధికారులను అదేశించారు. శనివారం కేయూసీ సెనెట్ హాల్లో నెల వారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సెంట్రల్ జోన్ పరిధిలో నమోదైన కేసులు, వాటి స్థితిగతులతో పాటు కేసుల్లో నిందితుల అరెస్ట్, కేసు దర్యాప్తులు, రికవరీ, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు, సంబంధిత పోలీస్ స్టేషన్ల వారీగా రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. మత్తు పదార్థాల విక్రయాలను కట్టడి చేసేందుకు ప్రతి పోలీస్ అధికారి శ్రమించాలన్నారు.
గంజాయి రహిత పోలీస్ స్టేషన్గా గుర్తింపు వచ్చేలా ప్రతి పోలీస్ అధికారి తమ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాలను అరికట్టాలని ఆయన కోరారు. గంజాయి విక్రయించే వ్యక్తులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా గంజాయి విక్రయాలు జరిగే హట్స్పాట్లను గుర్తించి నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు.
బాల్య వివాహల నియంత్రణ బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. వీటిని ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బాల్య వివాహలపై ఫిర్యాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి సుమోటో కింద కేసు నమోదు చేయాలన్నారు. భ్రూణ హత్యల నివారణకు స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలన్నారు. బాలికలు, మహిళల అదృశ్యంపై పోలీసులు తక్షణమే స్పందించాలన్నారు. పోలీస్స్టేషన్ అధికారి ప్రజలతో సత్సంబంధాలు కలిగిఉండాలని, గ్రామాలకు సంబందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు అబ్దుల్బారీ, కరుణాకర్, సీతారాం, అదనపు డీసీపీలు పుష్పారెడ్డి, సంజీవ్, సురేశ్కుమార్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
హోం మంత్రి మహమూద్ అలీని కలిసిన సీపీ రంగనాథ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హోం మంత్రి మహమూద్ అలీని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్గమధ్యలో హనుమకొండలోని పోలీస్ గెస్ట్హౌస్లో మంత్రి కొద్ది సేపు ఆగారు. ఈ సందర్భంగా రంగనాథ్ పుష్పగుచ్ఛం అందించారు.