జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)/ కృష్ణకాలనీ : కడియం శ్రీహరి, అరూరి రమేశ్ ఇద్దరూ పార్టీ ద్రోహులేనని వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ అన్నారు. వారికి కేసీఆర్ అన్ని విధాలా గుర్తింపు ఇచ్చినా పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డ ఆయన వారిపై దళితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని.. ఈ ఎన్నికల్లో కడియం, అరూరికి బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. శనివారం భూపాలపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి హాజరయ్యారు.
రుణమాఫీ చేస్తానని రాసివ్వు : మాజీ మంత్రి ఎర్రబెల్లి
పథకాల అమలుకు సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు వరకు గడువు పెట్టడాన్ని బట్టి ఎన్నికలు దాటవేయాలనే ఆలోచన ఉన్నట్లు అర్థమవుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ఇప్పుడు మాట మార్చి, ఆగస్టుకు వాయిదా వేశాడన్నారు. దమ్ముంటే ఆగస్టులో రుణమాఫీ అమలు చేస్తానని రాసివ్వు.. మాఫీ చేయకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని రాసివ్వు అని డిమాండ్ చేశారు. కేసీఆర్ను ఓడించినందుకు ప్రజలు బాధపడుతున్నారని, వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నట్లు కాంగ్రెస్ సర్వేలే చెప్తున్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై చేయి పడినా ఉరికించి కొట్టాలని, ఎవరైనా అక్రమ కేసులు పెడితే తాను కొట్లాడతానని భరో సా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ అన్నం పెట్టిన బీఆర్ఎస్కు సున్నం పెట్టిన రాజకీయ ద్రోహి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కడియం అంటే దళితులు, యువకులు మండిపడుతున్నారని, కావ్యను చిత్తుగా ఓడిస్తామని బహిరంగంగానే చెప్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు కావాలన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఒక్క ఎకరం భూమి, ఒక్క కుంట ఎండిపోలేదని, రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత కుంటలు, చెరువులు, వ్యవసాయ భూములు పూర్తిగా ఎండిపోయి కరువు తాండవిస్తున్నదన్నారు. భూపాలపల్లి జిల్లాను తీసేస్తానని అంటున్నావు, బిడ్డా.. రేవంత్రెడ్డి భూపాలపల్లి జిల్లాను తీసేస్తే ఉరికిచ్చుకుంటూ కొడతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ కడియం శ్రీహరి నిఖార్సయిన అవకాశవాదని, బీఆర్ఎస్లో అధికారం అనుభవించి ఇప్పుడు మోసం చేసి కాంగ్రెస్లో చేరిన నీచుడన్నారు. గండ్ర జ్యోతి మాట్లాడుతూ కేసీఆర్ విశ్వరూపం చూపిస్తే కాంగ్రెస్ భూస్థాపితమవడం ఖాయమన్నారు. మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి మాట్లాడుతూ ఇటీవలి సర్వేలో బీఆర్ఎస్ ఎనిమిది స్థానాల్లో గెలువబోతున్నదని, అందులో వరంగల్ ఎంపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలువబోతున్నాడన్నారు. మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కు లను సాధించిన బీఆర్ఎస్కు ఓటువేసి సుధీర్కుమార్ను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకుందామన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్యా సాగర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్యాదవ్, జడ్పీటీసీ గొర్రె సాగర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేశ్, నేతలు పోలుసాని నర్సింగరావు, రాకేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడియం ఎస్సీ కాదు.. పద్మశాలి
నిరూపించేందుకు నేను సిద్ధం మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి దళితుడు కాదని, పద్మశాలీ అని దానిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే జైలుకైనా వెళ్లేందుకు రెడీగా ఉన్నానని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆయన పుట్టు పూర్వోత్తరాలు అదే గ్రామానికి చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంద కృష్ణమాదిగ, మోత్కుపల్లి నర్సింహులు తర్వాత తనకు తెలుసన్నారు. కానీ, ఆయన దశాబ్దాలుగా ఎస్సీ రిజర్వేషన్లు అక్రమంగా పొందుతున్నారని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కడియం ఎస్సీనే కాదు అలాంటప్పుడు ఆయన బిడ్డ కావ్య ఎస్సీ ఎలా అవుతుందని రాజ య్య ప్రశ్నించారు. కావ్య ముస్లిం వ్యక్తిని పెండ్లి చేసుకొని శ్రీహరి వారసులమని చెప్తున్నదన్నారు. నక్కజిత్తుల కడియంతో ఏ దళిత నాయకుడూ బాగుపడలేదని, కులం పేరు చెప్పుకొని మోసం చేస్తున్న కావ్యను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు.