అధ్వానంగా వరంగల్-ఖమ్మం నేషనల్ హైవే
మోకాల్లోతు గుంతలతో అవస్థలు
రోడ్డుపై నరకప్రాయంగా ప్రయాణం
పట్టింపులేని కేంద్ర పాలకులు
ప్రాణాలను హరిస్తున్న గుంతలు
రాయపర్తి, జూలై 14: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ఊదరగొట్టే ఉపన్యాసాలను గంటల తరబడి చెప్పే ఆ పార్టీ పెద్దలకు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే జాతీయ రహదారుల వల్ల పడుతున్న ఇబ్బందులు మాత్రం కనిపించడం లేదా అని ప్రజలు, వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రాయపర్తి మండలంలోని రాయపర్తి, మైలారం, ఊకల్ క్రాస్రోడ్డు, జగన్నాథపల్లి క్రాస్రోడ్డు, జయరాంతండా క్రాస్ రోడ్డు, ఆర్అండ్ఆర్ కాలనీ, మొరిపిరాల క్రాస్రోడ్డు, కిష్టాపురం క్రాస్రోడ్డు మీదుగా ఉన్న వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి అతుకుల బొంత, గుంతలమయంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు, ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ హైవేపై లోతైన గుంతలు ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులతోపాటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.
అంతేకాకుండా ప్రస్తుత వర్షాలకు రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు చేరి ఊహించని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారుల మరమ్మతుల అంశాలను కేంద్ర పాలకులెవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే ప్రమాదకరంగా మారిన గుంతల వద్ద ముళ్లపొదలు, చెట్ల కొమ్మలు, రాళ్లు రప్పలను అడ్డుగా పెడుతూ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా పట్టుంచుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మరో లేయర్ తారు వేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.