కాశీబుగ్గ, జూన్ 11: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుబంధంగా నడుస్తున్న పండ్ల మార్కెట్లో రూ. కోటితో ఓ ఖరీదు వ్యాపారి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మార్కెట్ సమీపంలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద మామిడి మార్కెట్కు సరిగా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ సీజన్ను గీసుగొండ మండలంలోని ధర్మారంలో కొనసాగిస్తున్నారు. మార్కెట్ పరిధిలో సుమారు 20 మంది అడ్తి వ్యాపారులున్నారు.
స్థానికులతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వంద మంది వరకు మామిడి కాయలు కొనుగోలు చేసి వాటిని గ్రేడింగ్ చేసి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తారు. అలాగే, ఓ ఖరీదు వ్యాపారి మార్కెట్లో పది మంది అడ్తి వ్యాపారులను నమ్మించి, వారి నుంచి రూ. కోటి వరకు సరుకు తీసుకున్నాడు. నాణ్యమైన సరుకును ఇతర ప్రాంతాలకు తరలించి డబ్బులు చెల్లించే ముందు ఎవరికీ చెప్పకుండా ఇక్కడే తన వస్తువులు వదిలిపెట్టి పారిపోయాడు. మహారాష్ట్రకు చెందిన ఈ వ్యాపారి విశాల్ పేరుతో వ్యాపారం చేసినట్లు అడ్తిదారులు తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులు చూపించి వ్యాపారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇతడు గతంలో దంతాలపల్లిలో సుమారు రూ. 30 లక్షలు, హిమాచల్ ప్రదేశ్లో రూ. 1.80 కోట్లు అక్కడి వ్యాపారులకు కుచ్చుటోపీ పెట్టినట్లు తెలిసింది. అతడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు అడ్తి వ్యాపారుల వద్ద లేనందున వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే.. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇటీవల ఇద్దరు మిర్చి వ్యాపారులు అడ్తిదారులకు ఎగనామం పెట్టి పారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ అడ్తి వ్యాపారి గ్రామాల్లోకి వెళ్లి రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి పారిపోయిన ఘటన వెలుగుచూసింది. ములుగు జిల్లాలోని వెంకటాపురం గ్రామానికి చెందిన 10 మంది రైతుల వద్ద సుమారురూ.
కోటి విలువైన మిర్చిని కొనుగోలు చేసి ఎనుమాములలోని కోల్డ్ స్టోరేజీలో రైతుల పేరున నిల్వ చేశాడు. 20 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి రెండు నెలల నుంచి దాటవేస్తున్నాడు. బాధిత రైతులు చాంబర్, వ్యాపారులకు ఫిర్యాదు చేసినా ఏం న్యాయం జరగలేదు. అనంతరం ఎనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా మార్కెట్లో లైసెన్స్ లేకుండానే రూ. కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల మిర్చి ఖరీదు వ్యాపారి లడే తిరుపతి రూ. 3 కోట్ల వరకు టోకరా పెట్టాడు. లైసెన్స్ జారీ అవకతవకలపై మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు సంఘాల నాయకులు, వ్యాపారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా ఉద్యమిస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.