కాశీబుగ్గ, మార్చి 14: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం గురువారం ఎర్ర బంగారంతో నిండిపోయింది. లక్షా 20 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి వరకు కాంటాలు నిర్వహించినట్లు చెప్పారు. మర్చి యార్డులతోపాటు అపరాలు, పత్తి యార్డులు, అంతర్గత రోడ్లు మిర్చి బస్తాలతో దర్శనమిచ్చాయి.
మిర్చి రాక పెరగడంతో అడ్తి, ఖరీదుదారులతోపాటు దడువాయి, గుమస్తాలు, హమాలీలు, ఇతర కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మార్కెట్కు 6 లక్షల క్వింటాళ్లకు పైగా మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తేజ రకం క్వింటాల్కు రూ. 20,100, వండర్హాట్ రూ. 18 వేలు, యుఎస్ 341 రకం రూ. 17 వేలు, దేశీ రకం మిర్చి రూ. 36 వేలు, సింగిల్ పట్టి రూ. 44 వేలు, తాలు రకం రూ. 8500 ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అమ్ముకునేందుకు పక్క రాష్ర్టాల నుంచి రైతులు మిర్చిని తరలిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున రైతులు మిర్చిని తీసుకొస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి 341 మిర్చి రకం అధికంగా వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి అత్యధికంగా చపాట, 341 రకాలు వచ్చాని చెప్పారు. పక్క రాష్ర్టాల్లో మిర్చి ధర తక్కువగా ఉండడంతో ఇక్కడకు వస్తున్నట్లు వెల్లడించారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం సింగిల్ పట్టి మిర్చి రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ. 44 వేలు పలికింది. ఈ సీజన్లో అత్యధికంగా ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సింగిల్ పట్టి రకం మిర్చి మార్కెట్కు 800 క్వింటాళ్లు వచ్చినట్లు చెప్పారు.