గిర్మాజీపేట, ఫిబ్రవరి 9 : సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతి అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రతిపక్ష నేతలు బీసీ సంక్షేమంపై చర్చ సమయంలో సభలో లేకపోవడం బీసీలపై వారికున్న చిత్తశుద్ధి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీసీల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ వారి బతుకుల్లో వెలుగులు నింపిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. నాలుగు లక్షల మంది మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం 100 శాతం సబ్సిడీతో చెరువుల్లో చేపలు పెంచుతున్నారని చెప్పారు. కుల వృత్తినే జీవనాధారంగా చేసుకొన్న వారికి తెలంగాణ ప్రభుత్వం చేయూత ఇస్తున్నదన్నారు.
గౌడన్నలకు, గొర్రె పెంపకందారులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు బీమా కల్పించారని గుర్తు చేశారు. గీత కార్మికుల భవన నిర్మాణానికి కోకాపేటలో 5 ఎకరాల స్థలం, నిధులు కేటాయించడం గర్వించదగ్గ విషయమన్నారు. సుమారు 21,585 చేనేత, 43,104 మంది పవర్లూమ్ కార్మికులను గుర్తించి వారికి జియో ట్యాగింగ్ చేసి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు సంక్షేమం, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం సీఎం కేసీఆర్ ఘనతేనని ప్రశంసించారు. అలాగే, రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించి వారి కమీషన్ పెంచేందుకు ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. రేషన్ డీలర్లు తెలంగాణ ఉద్యమం, కరోనా కష్ట సమయాల్లోనూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిత్యావసర సరుకులు అందించారని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు.