ప్రజా ఆశీర్వాద సభతో ఓరుగల్లు జన జాతరను తలపించింది. మంగళవారం నగరంలోని కాకతీయ మెడికల్ కళాశాల మైదానంలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల సభ నిర్వహించగా సీఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు జెండాలు, ప్లకార్డులతో ర్యాలీగా వచ్చిన వేలాది ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులతో ఆ ప్రాంతమంతా గులాబీమయమైంది. వేదికపై కళాకారులతో కలిసి మిట్టపల్లి సురేందర్ ఆటాపాటలు, సభికుల ‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్’ నినాదాలతో కేఎంసీ గ్రౌండ్ మార్మోగింది. ఎన్నికల ప్రచారంలో ఇదే ఆఖరు సమావేశం కావడం, రెండు ప్రాంతాల నుంచి భారీగా రావడంతో కనీవినీ ఎరుగని రీతిలో సభ విజయవంతమైంది. వరంగల్ను ఐటీ, ఇండస్ట్రీ, టెక్స్టైల్, మెడికల్ సహా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో ప్రజల్లో ఆనందం వెల్లివిరియగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
వరంగల్, నవంబర్ 28 : ఎన్నికల ప్రచార పర్వంలో ఆఖరి రోజైన మంగళవారం కేఎంసీ మైదానంలో నిర్వహించిన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభ మధ్యాహ్నం ఉండగా రెండు నియోజకవర్గాల నుంచి ప్రజలు ఉదయం నుంచే తండోపతండాలుగా చేరుకోవడంతో నగర వీధులను ఎటుచూసినా జన సందోహమే కనిపించింది. హనుమకొండ, వరంగల్ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ సైన్యం దండులా కదిలివచ్చింది. ఎంజీఎం సెంటర్ నుంచి కేఎంసీ వరకు రహదారి అంతా వేలాది మందితో నిండిపోయింది. కిలోమీటర్ల పొడవునా రోడ్లు కిటకిటలాడగా ప్రచారం అఖరి రోజు నిర్వహించిన సీఎం కేసీఆర్ సభతో ఓరుగల్లు నగరం గులాబీవనమైంది.
సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకునే సమయానికి కేఎంసీ మైదానంతో పాటు పక్కన రహదారులు జనంతో నిండిపోయాయి. కేసీఆర్ సభ వేదిక పైకి రాగానే జనమంతా జై కేసీఆర్ నినాదాలతో స్వాగతం పలికారు. యువకులు అభిమానంతో గులాబీ రంగు పులుముకొని మైదానమంతా కలియతిరిగారు. సీఎం కేసీఆర్ ప్రసగింస్తున్న సమయంలో ప్రజలు ఈలలు వేస్తూ మద్దతు పలికారు. ఎన్నికల ప్రచార పర్వం ఆఖరు రోజు జరిగిన సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింపచేసింది. సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావడంతో బీఆర్ఎస్ నాయకుల్లో ఆనందం రెట్టింపయ్యింది. రెండు రోజుల్లో పోలింగ్ జరుగనున్న క్రమంలో ఓరుగల్లులో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ నిర్వహించడం కలిసి వస్తుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సభ సూపర్ సక్సెస్ కావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది.