ఏటూరునాగారం, ఆగస్టు 16 : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు సుమారు రెండు మీటర్ల మేర గోదావరి నీటిమట్టం పెరిగింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం 16.240 మీటర్లకు చేరుకున్నది. రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నది. 17.360 మీటర్లకు చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. క్రమంగా గోదావరి వరద జంపన్న వాగులోకి చేరుతున్నది. రామన్నగూడెం-రాంనగర్ మధ్యలోని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపైకి వరద చేరింది. దీంతో రాంనగర్, లంబాడీ తండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాంనగర్ నుంచి కమలాపురం వెళ్లే రోడ్డు పైనుంచి గోదావరి వరద ప్రవహిస్తున్నది. ఇటువైపు కూడా రాకపోకలు స్తంభించాయి. కరకట్ట తూముల్లో నుంచి వరద రామన్నగూడెం, ఏటూరునాగారంలోని ఇవతలి వైపునకు వస్తున్నది. వందలాది ఎకరాలు నీట మునిగాయి. 11 వార్డు నాగులమ్మ వీధిలోని పలు ఇండ్ల చుట్టూ వరద చేరింది. వీరంతా భయాందోళన చెందుతున్నారు. తమను సురక్షిత ప్రాంతానికి తరలించి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక జాతీయ రహదారి పక్క నుంచి గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఏటూరునాగారం, రొయ్యూరు, రామన్నగూడెం, రాంనగర్, లంబాడీ తండా గ్రామాల పరిసరాల్లోని వందల ఎకరాల్లో పంట భూములు నీట మునిగాయి. రామన్నగూడెంలోని శ్మశాన వాటిక మునిగిపోయింది. జడ్పీ సీఈవో రమాదేవి, తహసీల్దార్ సంజీవ, ఎస్సై రమేశ్, ఎంపీడీవో కుమార్ వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
83.5 మీటర్ల ఎత్తులో ప్రవాహం..
మంగపేట : గోదావరికి మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. నెల రోజుల క్రితం వరుసగా పది రోజుల పాటు నదీ తీర గ్రామాలు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. మళ్లీ గోదావరి ప్రవాహం పెరిగి కమలాపురం, బోరునర్సాపురం, అకినేపల్లి మల్లారం, కత్తిగూడెం, దేవనగరం గ్రామా ల్లో పొలాలు ముంపునకు గురికావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు తీర ప్రాంత గ్రామాలైన పొదుమూరు, బోరునర్సాపురం, దేవనగరం, అకినేపల్లిమల్లారం గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. రాత్రికి నదీ ప్రవాహం పెరిగే అవకాశాలున్నందున సురక్షిత ప్రదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చాటింపు వేయించామన్నారు. పంచాయతీ అధికారులు కూడా స్థానికంగా ఉండి పరిస్థితిని బట్టి అప్రమత్తం కావాలని హెచ్చరించినట్లు చెప్పారు. కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద మంగళవారం సాయంత్రం 83.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది.
ఇండ్లలోకి చేరిన వరద..
వాజేడు : మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరుతున్నది. దీంతో మండలంలోని పేరూరు, ఎడ్జర్లపల్లి, వాజేడు, పూసూరు వద్ద ప్రవాహం పెరుగుతున్నది. నాగారం గ్రామ శివారులోని కొన్ని ఇండ్లు నీట మునిగాయి. బీసీ కాలనీలో ఇండ్ల చుట్టూ వరద నీరు చేరింది. వాజేడు, గుమ్మడిదొడ్డి ప్రధాన రహదారి నీట మునిగిపోగా రాకపోకలు నిలిచిపోయాయి. టేకులగూడెం గ్రామ శివారులో 163 జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు వద్ద మంగళవారం గోదావరి నీటిమట్టం 15.380మీటర్ల(48 అడుగులు)కు చేరుకున్నదని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
రాకపోకలు బంద్..
వెంకటాపురం(నూగూరు) : ఇతర రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతమైన వెంకటాపురం మండలంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిన్నెల వాగు, కుక్కతొర్రె వాగు, బల్లకట్టు వాగుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. వరద నీరు ప్రధాన రహదారుల పైకి రావడంతో వెంకటాపురం-భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.