వరంగల్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంతో జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ కానున్నాయి. దీంతో ఆరోగ్యలక్ష్మి పథకం అమలు, చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ, ప్రీ-స్కూల్ నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగనున్నాయి. గురు వారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన హైదరా బాద్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,111 అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన విష యం తెలిసిందే. భర్తీ ప్రక్రియ చేపట్టాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి కసరత్తు చేపట్టింది. జిల్లాలో వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 919 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రస్తుతం వీటి ద్వారా 46,048 మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు పిల్లలు 6,040, మూడేళ్ల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 5,026, గర్భిణులు 24,947, బాలింతలు 10,003 మంది ఉన్నారు. ఈ అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు ఒక్కో లబ్ధిదారుకు మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు 75 గ్రాముల బియ్యం, 25 గ్రాముల కూరగాయలు, 15 గ్రాముల పప్పు, ఐదు గ్రాముల నూనె, గర్భిణులు, బాలింతలకు 150 గ్రాముల బియ్యం, 50 గ్రాముల కూరగాయలు, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది.
కోడిగుడ్లు ఒక్కొకరికి నెలకు ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు పదహారు, మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు 30, గర్భిణులకు 30, బాలింతలకు 30 లెక్కన, ప్రతిరోజు గర్భిణులు, బాలింతలకు ఒక్కొకరికి 200 మిల్లీలీటర్ల పాలు, ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల్లో ప్రతి ఒక్కరికి నెలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్ రూపంలో ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఒకపూట సంపూర్ణ భోజనం పథకం అమలు చేస్తోంది. గర్భిణులు, బాలింతలకు సరైన పోషకా హారాన్ని అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని తల్లులు, పిల్లల్లో చాలావరకు తగ్గించవచ్చని, తక్కువ బరువుతో పుట్టిన పిల్లల సంఖ్య, శిశు మరణాల సంఖ్య కూడా ఈ పథకం అమలుతో తగ్గించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదైన లబ్ధిదారులకు సంక్షేమ శాఖ అధికారులు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు.
జిల్లాలో ఖాళీలు ఎన్నంటే..
అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం ఖాళీలను ప్రభు త్వం మూడు కేటగిరిలుగా గుర్తించింది. జిల్లాలో ఉన్న మొత్తం 919 అంగన్వాడీ కేంద్రాల్లో మెయిన్ అంగన్ వాడీ కేంద్రాలు 847. వీటిలో 807 కేంద్రాల్లో అంగన్ వాడీ టీచర్లు ఉన్నారు. మిగత 40 మెయిన్ అంగన్ వాడీ కేంద్రాల్లో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 72 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉంటే వీటిలో 46 సెంటర్లలో టీచర్లు ఉన్నారు. 26 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం 847 సహాయకుల పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం 689 మంది సహాయకులు పనిచేస్తున్నారు. 158 అంగన్వాడీ సహా యకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పం పారు. మెయిన్, మినీ అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులతోపాటు సహాయకురాలి పోస్టు లను భర్తీ చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలోనూ పలువురు జడ్పీ టీసీలు, ఎంపీపీలు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్ల సైజు తక్కువగా ఉంటుం దని కూడా కలెక్టర్ బీ గోపి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్ ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవడం విశేషం. క్యాబినెట్ నిర్ణయంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నారు. కేంద్రం వారీగా భర్తీ చేయాల్సిన టీచర్లు, హెల్పర్ల పోస్టులపై నివేదిక తయారు చేస్తున్నారు.