కాళేశ్వరం, ఆగస్టు12 : మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది పరుగులు తీస్తున్నది. శక్రవారం 13.01 మీటర్ల ఎత్తులో 12.91 లక్షల క్యూసెక్కులుగా పారుతున్నట్లు అధికారులు తెలిపారు. పుష్కరఘాట్ వద్ద మూడో రోజు రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. పుష్కరఘాట్ పూర్తిగా మునగడంతో భక్తులు గోదావరిలో నదిలోకి వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
స్వల్పంగా తగ్గిన వరద..
మంగపేట : గోదావరి ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. 24 గంటల పాటు హెచ్చుతగ్గులతో ప్రవహించిన గోదావరి శుక్రవారం మధ్యాహ్నం నుంచి కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాం తాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కమలాపురం బిల్ట్ ఇంటేక్ వెల్ వద్ద సాయంత్రం గోదావరి సముద్ర మట్టానికి 83 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది.
కన్నాయిగూడెంలో..
కన్నాయిగూడెం : మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్, దేవాదుల ఎత్తిపోతల వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. నాలుగు రోజులైనా వాగులు, వంకల్లో గోదావరి బ్యాక్ వాటర్ నిలిచే ఉన్నది. శుక్రవారం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి 83.9 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. ఎగువనుంచి వస్తున్న 11 లక్షల 85 వేల క్యూసెక్కుల వరద నీటిని బరాజ్ గేట్లన్నీ ఎత్తి దిగువకు పంపిస్తున్నట్లు డీఈ శరత్, ఏఈ సాయిరామ్ తెలిపారు.