కుభీర్ : రైతులు తమ పంట క్షేత్రాలలో ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టేందుకుగాను ఫామ్ పాండ్ల ( Farm ponds ) ను నిర్మించుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా( Collector Bhavesh Mishra ) పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం డోడర్న గిరిజన గ్రామంలో గురువారం ఆయన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి గోరేఖ సంతోష్ సాగర రైతు క్షేత్రంలో ఫాం పాండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుత పరిస్థితుల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందున ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు తమ పంట క్షేత్రాలు, బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకుని భూగర్భ జలాల పెంపునకు నడుం బిగించాలని అన్నారు.
ఫాం పాండ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతు దంపతులను శాలువాతో సత్కరించారు. భూగర్భ జలాల పెరుగుదలకు మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో అక్కల్దేవి శ్రీనివాస్, ఏపీడీ ప్రసాద్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీవో భీమేష్, ఏపీవో రాథోడ్ హరిలాల్, టీఏలు, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.