వరంగల్, ఆగస్టు 8 : పెరికవాడ నాలాకు బల్దియా అధికారులు మార్కింగ్ మొదలుపెట్టారు. దశాబ్దాలుగా ఉన్న నాలా స్థలంలో రైల్వే శాఖ మూడో లైన్ నిర్మాణం చేపట్టడంతో పెరికవాడ నాలా పూర్తిగా కుదించుకుపోయింది. రైల్వే లైన్ నిర్మాణం చేపట్టిన ఆ శాఖ ప్రహరీని నిర్మించుకుంది. ప్రస్తుతం అగర్తాల నుంచి శివనగర్ మీదుగా వచ్చే వరద నీరు పెరికవాడ మీదుగా 12 మోరీలకు చేరుతుంది. ప్రస్తుతం పెరికవాడ నాలా కుదించుకపోవడంతో వరద నీటితో పెరికవాడ మునిగిపోతున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో ఈ ప్రాంతం నీటిలోనే నానుతోంది. ఇది బల్దియాకు పెద్ద సమస్యగా మారింది. పెరికవాడ నాలాను పక్కాగా నిర్మించపోతే స్థానిక ప్రజలు మురుగునీటితో సహవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, పెరికవాడ ముంపు సమస్యకు బల్దియా పరిష్కార మార్గం చూపేందుకు అడుగులు వేస్తోంది. సోమవారం గ్రేటర్ అధికారులు పెరికవాడ నాలా నిర్మాణం కోసం మార్కింగ్ చేశారు. అండర్బ్రిడ్జి నుంచి 12 మోరీల వరకు ఈ మార్కింగ్ చేస్తున్నారు.
40 అడుగుల వెడల్పు
పెరికవాడ నాలాను 40 అడుగల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ మేరకు బల్దియా అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. రైల్వే శాఖ మూడో లైన్ బౌండరీ తర్వాత పెరికవాడ నాలా వెడల్పు అస్తవ్యస్థంగా మారింది. ఒక్కో చోట ఒక్కో వెడల్పుతో ఉంది. అండర్ బ్రిడ్జి నుంచి 12 మోరీల వరకు 13 నుంచి 27 ఫీట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలా వెడల్పు 40 ఫీట్లుగా నిర్ణయించిన అధికారులు దాని ప్రకారం మార్కింగ్ చేస్తున్నారు.
40 ఇండ్లకు ఎఫెక్ట్
నాలా విస్తరణలో నాలాకు ఆనుకుని ఉన్న సుమారు 40 గృహాలను తొలగించాల్సి వస్తుందని బల్దియా అధికారులు తెలిపారు. తొలి రోజు మార్కింగ్లో సుమారు 10 గృహాలు ఎఫెక్ట్ అయ్యాయని మార్కింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన అధికారి తెలిపారు. ఒక్కో గృహం సుమారు 10 నుంచి 20 ఫీట్ల వరకు పోతోందని చెప్పారు. దీంతో మార్కింగ్కు వచ్చిన బల్దియా అధికారులతో బాధితులు గొడవకు దిగారు. తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని, వీటిని ఆక్రమణలు అని ఎలా మార్కింగ్ చేస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే, ఇప్పటికే నోటీసులు జారీ చేసిన బల్దియా అధికారులు మార్కింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫైనల్ నోటీసులు జారీ చేసి, కూల్చివేతలు చేపడుతామని చెబుతున్నారు.