కేంద్రం ప్రభుత్వం తెచ్చిన ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2022’పై కరెంటోళ్లు మండిపడ్డారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. విధులు బహిష్కరించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా ములుగు రోడ్డు సమీపంలోని విద్యుత్ కార్యాలయం వద్ద సిబ్బంది విధులు బహిషరించి నిరసన తెలిపారు. బిల్లును వెనుకకు తీసుకోకపోతే మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు.
– హనుమకొండ, ఆగస్టు 8
విద్యుత్రంగాన్ని నిర్వీర్యం చేసి దేశాన్ని చీకటిమయం చేసేందుకు సిద్ధమైన కేంద్ర సర్కారుపై కరెంటోళ్లు కన్నెర్రజేశారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2022’పై కదంతొక్కారు. ఎన్సీసీఓఈఈఈ పిలుపు మేరకు సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ సహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్యాలయాల ఎదుట మహాధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేదంటే మెరుపు సమ్మెకు సిద్ధమవుతామమని హెచ్చరించారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనగామలో నల్లబ్యాడ్జీలు ధరించి బైక్లపై భారీ ర్యాలీ తీశారు. అలాగే చెల్పూర్ కేటీపీపీ మెయిన్ గేట్ వద్ద మహా ధర్నాలో 1900మంది ఉద్యోగులు పాల్గొని బీజేపీ సర్కారుకు తమ గళాన్ని గట్టిగా వినిపించారు. రాబోవు రోజుల్లో వినియోగదారులు, రైతులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
హనుమకొండ, ఆగస్టు 8 : కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో మెరుపు సమ్మెకు సిద్ధమవుతామని జేఏసీ హెచ్చరించింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్సీసీవోఈఈఈ పిలుపు మేరకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ వద్ద సోమవారం మహా ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎస్పీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం వెంటనే విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. అంతేకాక ఈ విద్యుత్ సవరణ బిల్లు వల్ల ఉద్యోగులు, ప్రజలకు జరిగే నష్టాల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రజలు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టంతో పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల వినియోగదారులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఈ మేరకు విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వినియోగదారులు, రైతులను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో అనేక సమస్యలు ఉత్పన్నం కావడమే కాకుండా విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేత్తుల్లోకి వెళుతుందన్నారు. తద్వారా వినియోగదారుల నుంచి అధికంగా చార్జీలు వసూలు చేస్తారని తెలిపారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, నిరుపేదలకు సబ్సిడీలు ఎత్తివేస్తారన్నారు. ముఖ్యంగా విద్యుత్ ధరలను నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిథిలోకి వెళ్తుందన్నారు. విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, సీపీఎం నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. విద్యుత్తు బిల్లును వెనక్కి తీసుకునే వరకూ ఉద్యోగుల వెంట ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ నాయకలు బీ శ్యాంనాయక్, ఎన్ సుబ్రమణ్యేశ్వర్రావు, టీ శేషగిరిరావు, ఈ శ్రీధర్, ఎం జ్యోతీర్మయినాథ్, ఎన్ రాజేందర్, ఏ ఆనందం, కే గిరిధర్, ఏ శ్రీరాంనాయక్, ఎం హేమంత్కుమార్, ప్రభాకర్రెడ్డి, ఎం సతీశ్కుమార్, ఎండీ మహమూద్, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగుల విధుల బహిషరణ
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లుకు నిరసనగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ ఇచ్చిన పిలుపు మేరకు ములుగు రోడ్డు సమీపంలోని ట్రాన్స్కో విద్యుత్ కార్యాలయంలో ఉద్యోగులు(టీఎస్ పవర్ జేఏసీ) సోమవారం విధులు బహిషరించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ పవర్ జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, టీ జేఏసీ చైర్మన్ సంపత్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుపై వెనకి తగ్గకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. వివిధ సంఘాల నాయకులు సమావేశమై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, చంద్రప్రకాశ్, అశోక్, దేవేందర్రెడ్డి, దేవా, కుమారస్వామి, యాకూబ్, సందీప్, ప్రశాంత్, మోహన్, మహేశ్, శ్రీనివాసరావు, మాధవరెడ్డి, యుగేంధర్, రఘోత్తంరెడ్డి, భరత్, అజయ్, సంతోష్, మనోహర్, నరేశ్, తిరుపతి, నాదం, ప్రకాశ్, రాము, సజని, స్వప్న, రూబియాబీ బేగం పాల్గొన్నారు.