కేసముద్రం, జూలై 9 : కాకతీయుల ప్రజారంజక పాలన స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో ఆమె ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్తో కలిసి ఇనుగుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో కాకతీయుల శిల్పసంపద, శాసనాలు, పురాతన కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాగు, తాగు నీటికి ఉపయోగపడే విధంగా ఏడువందల సంత్సరాల క్రితమే కాకతీయులు గొలుసుకట్టు చెరువులను నిర్మించారని, వారి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీయించి నీటి నిల్వ సామర్థ్యం పెంచారని తెలిపారు.
కాకతీయులు వరంగల్ కోట కంటే ముందే ఇనుగుర్తి కేంద్రంగా పరిపాలన సాగించినట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. కాకతీయు రాజులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం చెరువులు రైతులు రెండు పంటలు పండించడానికి ఉపయోగపడుతున్నాయన్నారు. ఇనుగుర్తి మండల ఏర్పాటు ప్రక్రియపై చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ను ఆదేశించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా త్వరలోనే ఇనుగుర్తి మండలం ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్ సహకారంతో ఇనుగుర్తి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందించేందుకు పని చేస్తానని తెలిపారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ.. కాకతీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకే ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. కాకతీయులు నిర్మించిన కట్టడాలు, చెరువులు కాంగ్రెస్, టీడీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎండాకాలంలోనూ చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లానని, త్వరలోనే శుభవార్త వింటామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, ఇనుగుర్తిని మండల చేయకపోతే ఓటు అడుగనని స్పష్టం చేశాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, సర్పంచ్ దార్ల రామ్మూర్తి, మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, సింగిల్ విండో చైర్మన్ దీకొండ వెంకన్న, నాయకులు వద్దిరాజు కిషన్, మహ్మద్ నజీర్అహ్మద్, కముటం శ్రీనివాస్, బొబ్బిలి మహేందర్రెడ్డి, ఊకంటి యాకూబ్రెడ్డి, నీలం దుర్గేశ్, కొండ్రెడ్డి రవీందర్రెడ్డి, బేతమల్ల చంద్రయ్య, పింగిళి శ్రీనివాస్, మామిడి శోభన్, మాలోత్ మంగ్యానాయక్, శతకోటి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.