ఖిలా వరంగల్, జూలై 6 : ఓరుగల్లును రాజధానిగా చేసుకొని సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏలిన కాకతీయ చక్రవర్తుల పాలనాకాలం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 9వ శతాబ్దంలో రాష్ట్రకూటుల సేనానులుగా తమ రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన కాకతీయులు, తెలుగు నేలనంతా ఒకే గొడుగు కిందికి తెచ్చారు. నిరంకుశ రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న నాటి రోజుల్లో నిజమైన ప్రజాస్వామ్య పాలనకు శ్రీకారం చుట్టారు. సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం వంటి అన్ని రంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటుకొని చరిత్ర పుటల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. శత్రుదుర్భేద్యమైన కోటలు, కట్టడాలు.. అద్భుత శిల్పకళా సంపద కాకతీయుల నాటి కళావైభవాన్ని ఇప్పటికీ చాటుతున్నాయి.
మహోజ్వలంగా వెలిగిన కాకతీయుల సామ్రాజ్యం ముష్కరులు కుయుక్తులతో చేపట్టిన దండయాత్ర వల్ల అంధకారంలోకి వెళ్లినా కాకతీయుల పౌరుషం, జనరంజక పాలన, కీర్తి ప్రతిష్టలు అజరామరం. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఆసక్తిని మూటగట్టుకొని ఓరుగల్లు కోటలోకి అడుగు పెడుతూ తమ అనుభూతులను పంచుకుంటున్నారు. కాకతీయుల కట్టడాలను పరిరక్షించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాకతీయుల కోటను ప్రపంచంలోనే ఓ అద్భుత ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. కాకతీయుల ఘన కీర్తిని మరింత పెంచే దిశగా కీర్తి తోరణాన్ని రాజముద్రలో చేర్చింది.
365 ఆలయాలు.. 365 బావులు
చారిత్రక నేపథ్యం కలిగిన కోటలో 365 ఆలయాలు, 365 బావులు (కోనేరులు) ఉండేవని చరిత్ర చెబుతున్నది. ప్రస్తుతం కోటలో మాత్రం స్వయంభూ శంభు లింగేశ్వరస్వామి ఆలయం, నేల శంభునిగుడి, లక్ష్మీకొండల ఆలయం (లక్ష్మీపతి ఆలయం), భూగర్భంలో ఒక ఆలయంపై వరాలమ్మ ఆలయం, జంగమయ్య గుడి, మండలమ్మ ఆలయం, వేంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాలు, కొండగుడి శివాలయంతో పాటు మరో మూడు శిథిలమైన ఆలయాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఏడు కోటలు.. మిగిలినవి మూడు
చరిత్రకారులు చెబుతున్నట్లు ఓరుగల్లులో ఏడు అంచెలతో కాకతీయులు కోటను నిర్మించారు. మట్టికోట, పుట్టకోట, కంప కోట, కంచుకోట, గవనికోట, రాతికోట, కత్తికోట.. ఇలా ఏడు కోటలు ఉన్నట్లు తెలుస్తున్నా.. ప్రస్తుతం మూడు కోటలు పుట్ట కోట, మట్టి కోట, రాతి కోట మాత్రమే కనిపిస్తున్నాయి. 12.5 కిలోమీటర్ల వ్యాసం కలిగిన పుట్ట కోట ఆనవాళ్లు వంచనగిరి, వెంకటాపురం, బొల్లికుంట, కొండపర్తి, మొగిలిచర్ల తదితర గ్రామాల్లో కనిపిస్తున్నాయి. 2.4 కిలోమీటర్ల వ్యాసార్థంతో 7.2 కిలోమీటర్ల మేరక మట్టి కోట శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది.
ఈ మట్టికోటకు తూర్పు, పశ్చిమ ప్రధాన ద్వారాలున్నాయి. వీటి నుంచి గజ, తురగ (అశ్వాలు) పదాతి దళాలు, రథాలు వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంతోపాటు ఉత్తరం, దక్షిణంవైపు కూడా ఈ ద్వారాలు కేవలం కాలినడకకే పనికి వచ్చేలా నిర్మించారు. ఇందులో మట్టికోట గర్భంలో ద్వారాలకు అతి సమీపంలో ఎనిమిది త్రికూటాలయాలున్నట్లు ఆనవాళ్లున్నాయి. ఇక 1.2 కిలో మీటర్ల వ్యాసార్థంతో 4.5 కిలోమీటర్ల మేర ఉన్న రాతి కోటకు తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణంవైపు నాలుగు సింహద్వారాలున్నాయి. ఈ ద్వారాలు శత్రువులను అయోమయానికి గురిచేసేలా నిర్మించడం విశేషం. రాతికోటపై 42 బురుజులు వాటి మధ్య ఫిరంగుల కోసం నిర్మాణాలు ఉన్నాయి.
చారిత్రక బావులు
బావులు, కోనేరుల విషయానికి వస్తే శృంగారం బావి, అక్కాచెల్లెళ్ల బావి, సమతుల బావి, కోడికూత బావి, పుట్ట బావి, గడియారం బావి, ఈసన్న బావితోపాటు కోట బయట ప్రాంతాల్లో మరో రెండు భూ గృహంలో నిర్మించిన బావులు ఉండడం గమనార్హం. కాకతీయ చక్రవర్తులు నిర్మించిన ఆలయాలు, బావులు, చెరువులు వాటి నిర్మాణ శైలిని చూస్తే విజ్ఞానం పంచడమేకాకుండా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి.
వారం పాటు వేడుకలు
కాకతీయ చక్రవర్తుల చరిత్రను మరోసారి విశ్వవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సిద్ధమయ్యారు. ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో నేటి నుంచి వారంపాటు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. కాకతీయుల ముఖ్య ప్రాంతాల్లో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ఉత్సవాలకు కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను ప్రభుత్వం ఆహ్వానించగా నేడు ఆయన కోటకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వారం పాటు జరిగే వేడుకల్లో భాగంగా కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏకశిల గుట్ట పేరిటే..
కోటలో గంభీరంగా కనిపించే ఏకశిల గుట్టను ఎక్కి చూస్తే నగరంతోపాటు చుట్టూ గ్రామాలు, కొండలు, గుట్టలు కనువిందు చేస్తాయి. ఏకశిల (పెద్ద గుట్టను పోలి ఉన్న ఒకే బండ)పై ఆలయం, బురుజు, సైనిక శిబిరం ఉంది. ఏకశిల వల్లే కాకతీయుల నగరానికి ఏకశిలా నగరమనే పేరు వచ్చింది. ఏకశిల గుట్టకు ఒక పక్క చెరువు, మరోపక్క పార్కు ఉంది. పార్కులో ఆహ్లాదకర వాతావరణం.. చెరువులో బోటింగ్ సౌకర్యం ఉంది. ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఉత్సవాలు ఏ రోజు ఎక్కడంటే..
హనుమకొండ : కాకతీయ వైభవ సప్తాహం షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం..