జిల్లాలో ఆయిల్పామ్ సాగు కోసం ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది మొదటి విడుత 10,230 ఎకరాల్లో రైతులు పంట వేయనున్నారు. ఇందుకోసం భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. నీటి వసతి, విద్యుత్ సరఫరా, విస్తీర్ణం తదితర వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో రైతులకు ఆయిల్పామ్ మొక్కల పంపిణీ ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నారు. సంగెం మండలంలోని లోహిత గ్రామం వద్ద నర్సరీ ఏర్పాటు చేసి 6 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఆయిల్పామ్ సాగుకు సుముఖంగా ఉన్న రైతులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు తీసుకెళ్లారు. వారికున్న సందేహాలను నివృత్తి చేశారు. అదేవిధంగా డ్రిప్ మంజూరు చేసేందుకు అంచనాలు తయారు చేస్తున్నారు. ఒక్కో హెక్టారుకు ప్రభుత్వం రూ.38,481 ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, సన్నచిన్న కారు రైతులకు 90, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్ అందజేస్తుంది.
వరంగల్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో తొలివిడుత ఈ ఏడాది 10,230 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. కొద్ది రోజుల నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. ఆయిల్పామ్ సాగు చేసే ప్రతిపాదిత భూములను పరిశీలిస్తున్నారు. ఈ భూములకు సాగు నీటి వసతి, కరెంట్ సరఫరా వివరాలను సేకరిస్తున్నారు. డ్రిప్ మంజూరు చేసేందుకు అంచనాలు తయారు చేస్తున్నారు. త్వరలో రైతులకు ఆయిల్పామ్ మొక్కల పంపిణీ ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
లాభదాయకమైన పంటల సాగులో రైతులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఏటా జిల్లాలో కొన్ని వేల ఎకరాల ఆయిల్పామ్ సాగుకు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేయడానికి ముందుకొచ్చే రైతులకు మొక్కల సరఫరా, వారి నుంచి పంట ఉత్పత్తుల కోసం రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీని ఎంపిక చేసింది. దీంతో కొద్ది నెలల క్రితం సదరు ఇండస్ట్రీ సంగెం మండలంలోని లోహిత గ్రామం వద్ద నర్సరీ ఏర్పాటు చేసింది. రైతులకు సరఫరా చేసేందుకు ఈ నర్సరీలో ఆయిల్పామ్ మొక్కలను పెంచుతుంది. వీటిని ఈ నెల నుంచి ఉద్యానశాఖ అధికారులు ప్రణాళిక ప్రకారం రైతులకు పంపిణీ చేయనున్నారు.
ఒక్కో ఎకరంలో నాటేందుకు ఆయిల్పామ్ మొక్కలు 50 అవసరం. ఈ లెక్కన తొలి విడుత వచ్చే మార్చి వరకు 10,230 ఎకరాల్లో నాటడానికి సరిపడా సుమారు ఆరు లక్షల మొక్కలు లోహిత నర్సరీలో పెరుగుతున్నట్లు ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు. మండలంవారీగా ఈ ఏడాది గీసుగొండలో 555, సంగెంలో 936, చెన్నారావుపేటలో 496, దుగ్గొండిలో 940, ఖానాపురంలో 637, నల్లబెల్లిలో 650, నర్సంపేటలో 629, నెక్కొండలో 613, పర్వతగిరిలో 1,536, రాయపర్తిలో 948, వర్దన్నపేటలో 1,135, ఖిలావరంగల్లో 137, వరంగల్లో 90 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగుకు ప్లాన్ చేశారు.
10,230 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ఆరు నెలల్లో అవసరమైన మొక్కలను లోహిత నర్సరీ నుంచి సరఫరా చేసేందుకు నిర్ణయించారు. ఈ నెలలో 900, ఆగస్టులో 900, సెప్టెంబర్లో 900, నవంబర్లో 1,630, జనవరిలో 2,500, మార్చిలో 3,400 ఎకరాలకు ఆయిల్పామ్ మొక్కలను అందజేసేందుకు ప్రణాళిక తయారు చేశారు. జూలై నెలకు సంబంధించిన 900 ఎకరాల రైతులకు ఈ నెల 15 నుంచి మొక్కలను పంపిణీ చేసేందుకు యుద్దప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. వానకాలం ప్రారంభమైనందున ఈ నెలాఖరులోగా 900 ఎకరాల కోసం 45 వేల ఆయిల్పామ్ మొక్కలను రైతులకు అందజే యనున్నట్లు ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు.
సాగు భూములపై సర్వే..
ఆయిల్పామ్ సాగుకు ఆసక్తి కనబరుస్తున్న జిల్లాలోని రైతులు కొద్ది నెలల నుంచి ఉద్యానశాఖ అధికారులను కలిశారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలను తెలుసుకుని తాము సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వారికి దరఖా స్తులను అందజేశారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తామనేది కూడా దరఖాస్తుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యానశాఖ అధికారులు సదరు రైతుల పేర్లు, విస్తీర్ణం వివరాలను రికార్డుల్లో నమోదు చేశారు. ఆయిల్పామ్ సాగుకు సుముఖంగా ఉన్న రైతులను అవగాహన కల్పించేందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు తీసుకెళ్లారు. ఆయిల్పామ్ సాగు చేసిన రైతులతో మాట్లా డించారు.
ఇక్కడి రైతులు ఆయిల్పామ్ పంటను పరిశీలించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆయిల్పామ్ పంటల పరిశీలన కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులనూ ఉద్యాన శాఖ అధికారులు ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లారు. తొలివిడుత ఈ ఏడాది జిల్లాలో 10,230 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం నిర్ణయించిన దరిమిల సీరియల్ పద్ధతిన రైతుల దరఖాస్తులను పరిశీలించి 10,230 ఎకరాలను గుర్తించారు. ఆరు నెలల్లో విడుతలవారీగా ఆయిల్పామ్ మొక్కలను అందజేయనున్నట్లు ఈ విస్తీర్ణం రైతులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి 10,230 ఎకరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉద్యానశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వివిధ అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. ఆయిల్పామ్ సాగుకు ఎంపిక చేసిన రైతుల భూముల కొలతలు వేస్తున్నారు. వాటికి నీటి వసతి ఉందా, ఉంటే ఓపెన్ వెల్ లేదా బోరు ద్వారానా, ఓపెన్వెల్, బోర్వెల్కు కరెంట్ సరఫరా ఉందా అనే వివరాలను సేకరిస్తున్నారు. నివేదిక రూపొందించి నీటి వసతి కలిగి ఆయిల్పామ్ సాగుకు సిద్ధంగా ఉన్న భూముల్లో డ్రిప్ కోసం అంచనాలు తయారు చేస్తున్నారు.
సబ్సిడీపై డ్రిప్ మంజూరు..
ఆయిల్పామ్ సాగు చేసే రైతుల వ్యవసాయ భూములకు కచ్చితంగా డ్రిప్ వసతి అవసరం. ఈ క్రమంలో ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్ మంజూరు చేస్తుంది. ఒక్కో హెక్టారుకు రూ.38,481 కేటాయిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, సన్నచిన్న కారు రైతులకు 90, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్ అందజేస్తుంది. దీంతో ఉద్యానశాఖ అధికారులు సర్వేలో భాగంగా డ్రిప్ కోసం రూపొందించిన అంచనాలను ప్రభుత్వానికి పంపుతున్నారు. డ్రిప్ వేసే పనులు పూర్తయిన వెంటనే ఈ నెలలో ఆయిల్పామ్ మొక్కలు నాటే రైతులకు మరో కొద్ది రోజుల్లో లోహిత నర్సరీ నుంచి ఎకరానికి 50 చొప్పున మొక్కలను పంపిణీ చేయడం ప్రారంభించ నున్నట్లు ఉద్యానశాఖ అధికారి శంకర్ తెలిపారు. ఈ నేపథ్యం లో కొద్ది రోజుల నుంచి జిల్లాలో క్లస్టర్, మండలం వారీగా రైతులతో ఉద్యానశాఖ అధికారులు ఆయిల్పామ్ సాగుపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.