ములుగు, జూన్ 3 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల పక్కన రూ.కోటీ 73లక్షల వ్యయంతో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణం పూర్తి కాగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో ఆరు నెలల క్రితం నిర్మాణ పనులు చేపట్టగా పూర్తయ్యాయి. ఈ అతిథి గృహం లోప్రజాప్రతినిధులతోపాటు జిల్లాకు విచ్చేసే ముఖ్యఅతిథులు విడిది చేసేందుకు మూడు డార్మెటరీలతోపాటు డైనింగ్ హాల్, మీటింగ్ హాల్ నిర్మించారు.
మెడికల్ కళాశాల ప్రహరీ నిర్మాణం
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు పక్కన 50 ఎకరాలను మెడికల్ కళాశాలకు కేటాయించారు. వచ్చే సంవత్సరం ములుగు జిల్లాలో మెడికల్ కళాశాల ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి భూములకు హద్దులు నిర్ణయించారు. గిరిజన సంక్షేమ శాఖ రూ.2కోట్ల 60లక్షల నిధులు మంజూరు చేసింది. రెండున్నర కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మాణానికి టెండర్లు పూర్తి కాగా, వారం రోజుల క్రితం ప్రారంభమైన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటితోపాటు మార్కెట్ యార్డులో 200 పడకల దవాఖాన నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి.
నేడు ప్రారంభించనున్న మంత్రి
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ శనివారం ములుగు, గోవిందరావుపేట మండలాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభోత్సవాలు, దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో నిర్మించిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. కమ్యూనిటీ కిచెన్ షెడ్కు శంకుస్థాపన చేయనున్నారు. ములుగు మండలం ఇంచర్లకు కమ్యూనిటీ కిచెన్ షెడ్ శంకుస్థాపన చేసి, జంగాలపల్లిలో నిర్వహించే ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహాన్ని ప్రారంభించి, మెడికల్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. డిగ్రీ కళాశాల మైదానంలో దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్లో రూ.48లక్షలతో నిర్మించిన 5 కార్యాలయాల ప్రారంభించి, ‘మన ఊరు-మనబడి’, ‘ఈ హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య పాల్గొననున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.