గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 126 గ్రామ పంచాయతీల పరిధిలో స్థలాలను అధికారులు గుర్తించారు. గ్రౌండ్లో కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో లాంటి ఆటలకు సంబంధించిన కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో నీడనిచ్చే, ఆహ్లాదభరితంగా ఉండే ఈ మొక్కలు నాటనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న మొదట మండలానికి రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలకు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వీటిని అభివృద్ధి చేయనున్నారు.
హనుమకొండ, మే 27 : గ్రామీణ క్రీడలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసి క్రీడాకారులకు సకల సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించింది. ఇప్పటికే పల్లెప్రగతి, హరిత హారం కార్యక్రమాల ద్వారా పల్లెల రూపు రేఖలు మార్చిన ప్రభుత్వం తాజాగా పల్లెల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ నిర్ణయంతో గ్రామాల్లో క్రీడా సందడి నెలకొననుంది. జిల్లాలోని 126 గ్రామ పంచాయతీల పరిధిలో స్థలాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మైదానాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో లాంటి ఆటలకు సంబంధించిన కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రవేశ ద్వారం, చుట్టూ నీడనిచ్చే, ఆహ్లాదభరితంగా ఉండే మొక్కలు, నాటనున్నారు. ఈ మొక్కలు నాటేందుకు మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ క్రీడాకారులు తగినంత సాధన చేసుకోవడంతో వారి ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం ఏర్పడింది.
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల్లోని ప్రతిభ వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల ఆధారంగా పెద్ద గ్రామ పంచాయతీల పరిధిలో ఎకరం, చిన్న గ్రామ పంచాయతీల పరిధిలో అర ఎకరానికి తగ్గకుండా ఉండే విధంగా రూ.5 లక్షల చొప్పున వెచ్చించి క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, డీఆర్డీవో అధికారులు స్థలాలను గుర్తించి, సౌకర్యాల ఏర్పాటులో నిమగ్నం అయ్యారు. అయితే, పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన శాశ్వత పనులనే ఈ మైదానాల్లో కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న మొదట మండలానికి రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. భూమిలోని చెట్లను తొలగించి చదును చేయడం, వీలైతే మైదానం చుట్టూ ఫెన్సింగ్ లాంటివి కూడా వేసేందకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 2న 14 మండలాల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు అందుబాటులోకి రానున్నాయి. తర్వాత మిగిలిన పంచాయతీల్లో క్రీడా మైదానాలను ప్రారంభించనున్నారు.
గ్రామీణ క్రీడా మైదానాలను అభివృద్ధి చేసేందుకు ఈజీఎస్ నిధులు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. స్థలాలను చదును చేయడం, అవసరమైన ప్రాంతాన్ని మట్టితో నింపడం, చుట్టూ మైదానాల చుట్టూ మొక్క లు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్రీడా మైదానాల ప్రారంభం అనంతరం నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు.
జిల్లాలోని 126 గ్రామ పంచాయతీల పరిధిలో స్థలాలను గుర్తించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా ప్రతి మండలంలో రెండు చొప్పున 24 గ్రామాల్లో మైదానాలకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశాం. రూ.5 లక్షల ఈజీఎస్ నిధులతో ఎకరం స్థలంలో మైదానం ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న క్రీడా మైదానాల ఏర్పాటు నిర్ణయంతో గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వారిలోని ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
-ఏ శ్రీనివాస్కుమార్, డీఆర్డీవో