వరంగల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్తోపాటు వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ ఈనెల 20న మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్ పర్యటనలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన వాటిని ప్రా రంభించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, వరంగల్ కలెక్టర్ గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా పీవో అజిత్రెడ్డితో సమావేశం నిర్వహించారు. మంత్రి పర్యటనలో ప్రారంభించే, శంకుస్థాపనలు చేసే కార్యక్రమాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. వరంగల్ మహానగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
తాత్కాలికంగా ఖరారు చేసిన ప్రకారం… 
వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి మంత్రి కేటీఆర్ పర్యటన మొదలుకానుంది. నర్సంపేటలో పైపులైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్, మెప్మా భవనం ప్రారంభోత్సవం చేస్తారు. దుగ్గొండి, చెన్నారావుపేట మండల మహిళా సమాఖ్యల భవనాల నిర్మాణానికి నర్సంపేటలోనే శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తారు. అనంతరం కాకతీయ వైద్య కళాశాలకు చేరుకుని గ్రేటర్ వరంగల్లో పర్యటన మొదలుపెడతారు. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆధునీకరించిన పబ్లిక్ గార్డెన్, స్మార్ట్ లైబ్రరీ, రెండు స్మార్ట్ రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ, కుడాపై సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి కేటీఆర్ పర్యటనలోని కార్యక్రమాలపై ఈ నెల 19న పూర్తి స్థాయి స్పష్టత రానుందని అధికారులు తెలిపారు.
టీఆర్ఎస్ సమావేశం..
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా పార్టీ పరంగా కీలక కార్యక్రమం ఉంటున్నది. వరంగల్, హనుమకొండ జిల్లాల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారు. ఎల్బీ కాలేజీ గ్రౌండ్లో ఈ సమావేశం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సమీక్ష సమావేశం అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరుగనుంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 20 వేల మంది ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవుతారనే అంచనాకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ ఆధ్వర్యంలో ఎల్బీ కళాశాలలో సమావేశం ఏర్పాట్ల పర్యవేక్షణ జరుగుతున్నది.
ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలి : మేయర్
వరంగల్ : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగర పర్యటనకు వస్తున్న తరుణంలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్సిటీలో భాగంగా నిర్మించిన రోడ్3, 4ను పరిశీలించి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, కార్పొరేషన్ పరిపాలన భవనం, కౌన్సిల్హాల్, స్విమ్మింగ్ పూల్, ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఇండోర్ స్టేడియం ఎదుట ఆవరణలో ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. దీంతో పాటు ఎంజీఎం సర్కిల్లోని కిడ్నీ ఐలాండ్ను గ్రీనరీతో సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ ఎస్ఈ సత్యనారాయణ, స్మార్ట్సిటీ ప్రతినిధి ఆనంద్ వోలేటి, ఈఈ శ్రీనివాసరావు, డీఈ రవికుమార్, ఏఈ కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.