ఖిలావరంగల్/వరంగల్చౌరస్తా, మార్చి 29: దేశంలో కష్టజీవుల వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి వరంగల్చౌరస్తా వరకు అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, రైతులపై బీజేపీ అవలంబిస్తున తీరును ఎండగడుతూ కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కార్మికుల హక్కులను కాలరాస్తున్నదన్నారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించాలని కేంద్రం చూస్తున్నదన్నారు. పని గంటలు పెంచి కార్మికులపై అధిక భారం మోపాలని యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. పేదలను కొట్టి కార్పొరేటర్ శక్తులకు దోచిపెడుతున్నదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల ప్రజల సొమ్ము వారి చేతుల్లోకి వెళ్తుందని వివరించారు. నియంత్రణ లేకుండా రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, ఫలితంగా సామాన్యులపై పెనుభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పక్షపతి సీఎం కేసీఆర్ అని, కార్మికులకు అండగా ఉంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, గుండేటి నరేందర్, వేల్పుగొండ సువర్ణ, గందె కల్పన, బాల్నె సురేష్, సోమిశెట్టి ప్రవీణ్, బైరబోయిన ఉమా దామోదర్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, మైదం నరేశ్, మర్రి శ్రీనివాస్, గడల రమేశ్, ఇనుమల మల్లేశం, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెళ్లి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, బండి కోటేశ్వర్రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, నగర కార్యదర్శి భాషుమియా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గన్నారపు రమేశ్, టీఏడీయూ నాయకులు ఎమ్మడిశెట్టి రాజు, అన్వర్, సూరి, కరుణాకర్, సురేశ్ పాల్గొన్నారు.