నర్సంపేట, ఫిబ్రవరి 23: వ్యవసాయం బావుల మోటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు బిగిస్తే రైతులు ఉచిత కరంటు సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట, గార మండలాల్లోని గోపాలపెంట, శ్రీకూర్మం గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద బిగించిన మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీటర్ల బిగింపు వల్ల రైతులకు వ్యవసాయం భారంగా మారుతుందన్నారు. గ్రామాల్లో దాదాపు 30,000 వ్యవసాయ కనెక్షన్లకు కరంటు మీటర్లు బిగించే ప్రక్రియ పూర్తయిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే మీటర్లు బిగించడం ఆపాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూములకు ఉచిత కరంటును నిలిపివేసే డ్రాఫ్ట్ బిల్లును తెలంగాణ ప్రభుత్వానికి కూడా పంపించిందని, కానీ రైతుల మేలు కోరే సీఎం కేసీఆర్ మీటర్లు బిగించేది లేదని తేల్చి చెప్పారన్నారు. రైతుల నడ్డి విరిచే ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం డిమాండ్ చేసి గుర్తు చేశారు. కాగా, సీఎ చెప్పిన దాంట్లో నిజం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి తప్పుడు ప్రకటనలు చేశారని, ఏపీలో మీటర్లు బిగించడం ప్రత్యక్షంగా చూశానని, దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి రైతులు బీజేపీ ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది.. రేపు దేశ వ్యాప్తంగా జరుగవచ్చన్నారు. వ్యవసాయం మోటర్లకు మీటర్లు బిగించే కేంద్ర ప్రభుత్వానికి త్వరలో మనమే మీటర్లు బిగిద్దామని, ఏపీ రైతులతో పాటు తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.