ఆమె ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం ఓడిపోయింది.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. గురువుల మార్గనిర్దేశం.. స్నేహితుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంది.. కళ్లు లేకున్నా బ్యాంకులో ఉద్యోగం చేస్తూ అందరితో ‘ఔరా’ అనిపిస్తున్నది.
– పాలకుర్తి రూరల్, ఫిబ్రవరి 22
పాలకుర్తి మండలంలోని లక్ష్మీనారాయణపురానికి చెందిన పోగు సుభద్ర, వేంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు బిడ్డలు. పెద్ద కూతురు హిమబిందు. చిన్న కూతురు ఐశ్వర్య. హిమబిందుకు చిన్నప్పటి నుంచే కళ్లు లేవు. ఐదో తరగతి వరకు లక్ష్మీనారాయణపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పదో తరగతి వరకు మలక్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాయి జూనియర్ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ, పీజీ బ్రెయిలీ లిపిలో పూర్తి చేసింది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం సాధించాలనే లక్ష్య సాధనతో ముందుకు సాగింది. తల్లిదండ్రుల సహకారంతో కృషి చేసింది. చదువు పూర్తి కాగానే ఐపీబీఎస్లో పీవో పోస్టు ఇంటర్వ్యూ దాకా వెళ్లి విఫలమైంది. బ్యాంక్ ఉద్యోగం సాధించాలన్నా టార్గెట్ పెట్టుకొని సెల్ ఫోన్లో స్టడీ మెటీరియల్ను రికార్డు చేసుకుని కష్టపడి సన్నద్ధమైంది. అందరితో పోటీపడి 2021లో ఏపీజీవీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్) బ్యాంక్లో క్యాషియర్గా ఉద్యోగం సాధించింది. గోల్డ్లోన్, క్యాష్ లెక్కలను సిస్టమ్లో ఫీడ్ చేస్తూ విధులు నిర్వర్తిస్తున్నది. ప్రస్తుతం మానుకోట జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు శాఖలో పని చేస్తూ నెలకు రూ.40వేల జీతం పొందుతున్నది.
నాకు ఆంధత్వం ఉన్నా బ్యాంక్ ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. కళ్లు కనిపించవని నేను ఏనాడూ కుంగిపోలేదు. లోకాన్ని చూడలేకపోతున్నాననే బాధ తప్ప ఏ విషయాల్లోనూ బాధ పడలేదు. బ్యాంక్లో జాబ్ కొట్టాలని నా చిన్నతనం నుంచి కోరిక ఉండేది. లక్ష్య సాధనలో నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శనం, స్నేహితుల సహకారం మరువలేను.
– పోగు హిమబిందు, బ్యాంక్ ఉద్యోగి