పోచమ్మమైదాన్(కాశీబుగ్గ), డిసెంబర్ 21: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ గోపి ఆదేశించారు. వరంగల్ ఎనుమాముల, కాశీబుగ్గ ప్రాంతంలోని రేషన్ షాపులను బుధవారం ఆయన ఆర్డీవో మహేందర్జీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని బియ్యం, రిజిస్టర్లు, కాంటాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్డుదారులకు బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. ప్రతి లబ్ధిదారుడికి విధిగా రేషన్ సరుకులు అందించాలన్నారు. కలెక్టర్ వెంట వరంగల్ తహసీల్దార్ సత్యపాల్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
నందనాయక్తండాలో రేషన్ షాపు తనిఖీ
గీసుగొండ: మండలంలోని నందనాయక్తండాలో రేషన్ షాపును కలెక్టర్ గోపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెయింగ్, ఈ-పాస్ మిషన్లతోపాటు బియ్యం బ్యాగులకు ఉన్న ట్యాగ్లకు పరిశీలించారు. షాపులో ఉన్న బియ్యం నిల్వ వివరాలను డీలర్ సుభద్రను అడిగి తెలుసుకున్నారు. షాపులో 14 క్వింటాళ్ల 60 కిలోల బియ్యం ఉన్నట్లు తెలిపారు. కార్డుదారులందరికీ ప్రతి నెలా బియ్యం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేషన్ షాపులకు మొత్తం సన్న బియ్యం లేదా దొడ్డు బియ్యం పంపిణీ చేయాలని, రెండు రకాల బియ్యం వస్తుండడంతో కార్డుదారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీలర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఒకే రకమైన బియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ డీఎస్వోను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స కోట, జిల్లా సవిల్ సప్లయ్ అధికారి గౌరీశంకర్, ఆర్ఐ సాంబయ్య పాల్గొన్నారు.