వరంగల్, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి అనతికాలంలోనే విశేష ప్రగతిని సాధించడంతో తలసరి ఆదాయ వృద్ధి వేగంగా పెరుగుతోంది. ఇటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా వెల్లడైన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(టీఎస్డీపీఎస్)-2020-21 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు తలసరి ఆదాయం పెంచుకోవడంలో వేగంగా ముందుకు సాగుతున్నాయి. మొత్తం సంపదను మూడు రంగాలుగా విభజించి లెక్కించగా ఎక్కువమంది ఆధారపడే వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లిలో 2.14 లక్షలు ఉండగా, మిగతా ఐదు జిల్లాల్లో లక్షపైనే ఉండడం విశేషం.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ సత్తా చాటుతున్నది. అన్ని రంగాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా దూసుకుపోతున్నది. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధితో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు అనూహ్య ప్రగతి సాధిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం(టీఎస్డీపీఎస్) 2020-21 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో వేగంగా ముందుకు సాగుతున్నది.
ప్రజల జీవన పరిస్థితుల అంచనాలో కీలకమైన తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని పెద్ద రాష్ర్టాల కంటే ముందువరుసలో ఉన్నది. అలాగే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు తలసరి ఆదాయ వృద్ధిలో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తలసరి ఆదాయం వేగంగా పెరుగుతున్నది. ఎక్కువ జనాభా ఆధారపడే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. దీంతో గ్రామీణ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లోనూ తలసరి ఆదాయం వృద్ధి ఎక్కువగా ఉంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నది. పంట గిట్టుబాటు కావడంతో సంపద వృద్ధి అవుతున్నది. వ్యవసాయంపై ఆధారపడే రైతులు, రైతు కూలీలు, యంత్రాల నిర్వాహకులు, వీటిపై ఆధారపడేవారు, అందరి ఆర్థిక పరిస్థితిలో పురోగతి నమోదవుతున్నది.
కొవిడ్ సమయంలోనూ అనూహ్య ప్రగతి..
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పురోగతికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనూ రాష్ట్రం దాదాపు అన్ని రంగాల్లో పురోగతిని సాధించింది. ఎక్కువ మంది జీవనం సాగిస్తున్న వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నది. సేవారంగం పురోగమిస్తున్నది. ఇండస్ట్రీ, మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాలతో పలు జిల్లాల తలసరి ఆదాయం వేగంగా పెరుగుతున్నది. రాష్ట్ర సంపదను మూడు రంగాలుగా విభజించి లెక్కిస్తారు. ప్రాథమికరంగంలో వ్యవసాయం, అనుబంధరంగాలు ఉంటాయి. ద్వితీయరంగంలో ప్రధానంగా పరిశ్రమలు, విద్యుత్రంగం, నిర్మాణం, నీటి సరఫరా వంటివి వస్తాయి. సేవారంగంలో ఐటీ, కమ్యూనికేషన్, హోటల్స్, రెస్టారెంట్లు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు(రియల్ ఎస్టేట్), ప్రజా రవాణా, ఆర్థిక సేవలు, సాధారణ పరిపాలన మూడోరంగంలో ఉంటాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వందల కొద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. సర్కారు సంక్షేమ పథకాలు పేదలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆసరా పెన్షన్లను రూ.3016, రూ.2016 చొప్పున ఇస్తోంది. ఇంత మొత్తంలో సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించించి. విద్య, వైద్యంలో పేదల అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పించింది. దాదాపు వెయ్యి సంక్షేమ హాస్టళ్లు, ప్రతి జిల్లా కేంద్రంలో ఆస్పత్రిని తీర్చిదిద్దింది. ప్రధాన రంగాల వృద్ధి, సర్కారు చేయూతతో అన్ని జిల్లాల తలసరి ఆదాయం పెరుగుతున్నది.