ఖిలావరంగల్, డిసెంబర్ 13: మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్య ధోరణి తగదని, ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీ గోపి అధికారులను హెచ్చరించారు. మన ఊరు-మనబడి కార్యక్రమానికి సంబంధించిన పనుల పురోగతిపై మంగళవారం ఆయన కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాకు రూ. 3.8 కోట్లు రివాల్వింగ్ ఫండ్ రూపంతో నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. పనులు గ్రౌండ్ అయి 40 పాఠశాలల ఎంబీ రికార్డులు చేయని అధికారులపై సీరియస్ అయ్యారు. వర్క్కు సంబంధించిన ఎంబీ రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే నిధులు సమకూరుతాయని, తద్వారా ఎలక్ట్రికల్ పనులు, టాయిలెట్స్, ప్రహరీ, కిచెన్షెడ్లకు సంబంధించిన పనుల్లో జాప్యం జరుగదని గుర్తుచేశారు. మండలాల వారీగా మన ఊరు- మనబడి కార్యక్రమంలో పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలని, ఇందుకోసం మండల స్పెషలాఫీసర్లు, ఈఈలు, ఏఈలు, ఎంఈవోలు, నోడల్ అధికారులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సర్పంచ్లు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని, ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
ప్రత్యేక ప్రణాళితో ముందుకెళ్లాలి..
ఎన్ఆర్ఈజీఎస్ పనుల విషయంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ఎల్ఈడీ లైట్లు, సోలార్ ఫ్యాన్లు ఏర్పాటు చేసే విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని 150 పాఠశాలల్లో ఉన్న వసతుల్లో ఏదో ఒక రూమ్ను లైబ్రరీగా మార్చడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకోసం లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. కుర్చీలు, డ్యూయల్ డెస్కులు, బీరువాలు సమకూర్చుకోవాలని, పెయిటింగ్ విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. మళ్లీ నిర్వహించే సమావేశంలో పనుల్లో పురోగతి కనిపించకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అశ్వినితానాజీ వాకడే, శ్రీవత్స కోట, డీఈవో డీ వాసంతి, ఎంఈవోలు, మండలాల ప్రత్యేకాధికారులు, పంచాయతీరాజ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.